టెండర్లలో గోల్మాల్ జరిగింది
జీహెచ్ఎంసీలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ టెండర్లు రద్దు చేయాలి
` సీఎం రేవంత్రెడ్డికి ఎమ్మెల్సీ కవిత లేఖ
హైదరాబాద్(జనంసాక్షి): జీహెచ్ఎంసీలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ టెండర్లు రద్దు చేయాలని భారాస ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. ఈమేరకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి లేఖ రాశారు. ‘’జీహెచ్ఎంసీలో వర్షాకాలం పనుల టెండర్లలో గోల్మాల్ జరిగింది. ఇన్స్టంట్ రిపేర్ టీమ్స్ టెండర్లు రద్దు చేయాలి. కొందరు అధికారులు అనుకూల సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకు యత్నించారు. తెలంగాణ బీసీ కాంట్రాక్టర్లకు నష్టం చేసేలా సిబ్బంది వ్యవహారం ఉంది. విదేశీ సంస్థ వాహనాలే వాడేలా నిబంధనలు రూపొందించారు. ఒక సంస్థ, రెండు ఏజెన్సీలకు లబ్ధి కలిగేలా నిబంధనలు మార్చారు. నిబంధనల మార్పుతో జీహెచ్ఎంసీపై ఏటా రూ.5.85 కోట్ల అదనపు భారం పడనుంది. ప్రస్తుతం తొమ్మిది జోన్ల వారీగా టెండర్లు పిలుస్తున్నారు. టెండర్ల నిబంధనల్లో మార్పుతో తెలంగాణ కాంట్రాక్టర్లకు నష్టం జరుగుతుంది’’ అని లేఖలో పేర్కొన్నారు.