డిసెంబర్‌ 9 ప్రకటనకు కట్టుబడాలి

ఖమ్మం, నవంబర్‌ 15 : డిసెంబర్‌ 9, 2009 నాటి ప్రకటనకు కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉండాలని కోరుతూ అదే రోజు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఒక్కరోజు దీక్ష చేపట్టనున్నట్టు తెలంగాణ విద్యార్థి ఐక్య కార్యాచరణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పిడమర్తి రవి తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తెలంగాణ ప్రక్రియను ప్రారంభించాలని అన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంపిలు తమ పదవులకు రాజీనామాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమంలో కలిసిరావాలని అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఇస్తామని చెప్పి తెలంగాణ ప్రాంత ప్రజల ఓట్లతో గద్దెనెక్కి ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్న కాంగ్రెస్‌పార్టీని ప్రజలు క్షమించరని అన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధన తమ ధ్యేయమని చివరి రక్తపు బొట్టువరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ధారపోస్తామని అన్నారు.