డొల్ల కంపెనీల ద్వారానే మాల్యా నిధులు మళ్లింపు
దర్యాప్తులో గుర్తించిన ప్రభుత్వం
న్యూఢిల్లీ,సెప్టెంబర్26(జనంసాక్షి): లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.6,027 కోట్లలో ఎక్కువ మొత్తాన్ని డొల్ల కంపెనీల ద్వారానే దేశం దాటించినట్టు తెలుస్తోంది. సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్
డైరెక్టరేట్ (ఇడి) అధికారులు ఈ విషయం గుర్తించి ప్రభుత్వానికి చెప్పినట్టు తెలుస్తోంది. ఈ డొల్ల కంపెనీల వివరాలతో పాటు, నిధులు మళ్లించిన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్తో సహా ఏడు దేశాల్లోని బ్యాంకు ఖాతాల వివరాలనూ దర్యాప్తు సంస్థలు సంపాదించాయి. మాల్యా ఆదేశాలతోనే ఇదంతా జరిగిందని కూడా దర్యాప్తులో తేలినట్టు సమాచారం. ఈ వివరాలతో మాల్యాను బ్రిటన్ నుంచి భారత్కు రప్పించేందుకు మరింత బలం చేకూరిందని అధికార వర్గాలు చెప్పాయి. అయితే మాల్యా ఎంత మొత్తం నిధులను ఇలా దారిమళ్లించారనే విషయం తెలియాల్సి ఉంది. దీంతో ఇప్పటి వరకు డొల్ల కంపెనీల పేరుతో నిధులు మళ్లించిన వాటిపై మరిన్ని చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా మరో రెండు లక్షల మంది డైరెక్టర్లపై అనర్హత వేటు వేసింది. దీంతో ఇప్పటి వరకు అనర్హత వేటు పడిన డైరెక్టర్ల సంఖ్య 3 లక్షలకు చేరింది. అనర్హత వేటు పడిన కంపెనీల డైరెక్టర్లు అదే కంపెనీలో మళ్లీ డైరెక్టర్గా ఎన్నికయ్యేందుకు వీలులేదు. ఇతర కంపెనీల్లోనూ ఐదేళ్ల వరకు డైరెక్టర్ పదవులు పొందేందుకు వీలుండదు. దీంతో ఇప్పటికే వీరు డైరెక్టర్లుగా కొనసాగుతున్న లిస్టెడ్ కంపెనీల బోర్డుల నుంచి వైదొలగాలని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. డొల్ల కంపెనీలనే అనుమానంతో మరో 10వేల కంపెనీల రిజిస్టేష్రన్లు రద్దు చేసింది. అలాగే
అనుమానాస్పద లావాదేవీలు జరుపుతున్నడొల్ల కంపెనీల జాబితాను దర్యాప్తు సంస్థలు ఇప్పటికే ప్రభుత్వానికి అందజేసినట్టు సమాచారం. ఇందులో ఫైనాన్షియల్ ఇంటెలీజెన్స్ యూనిట్ నుంచే అనేకమైన డొల్ల కంపెనీల జాబితా ప్రభుత్వానికి అందింది. వీటిలో ఎక్కువ భాగం ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, ఎంటర్టైన్మెంట్ రంగాలకు చెందిన కంపెనీలే ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. ఈ కంపెనీల బ్యాంకు లావాదేవీలనూ నిలిపివేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆయా బ్యాంకులను కోరింది. రద్దయిన ఏదైనా కంపెనీ డైరెక్టర్ ఆ కంపెనీ బ్యాంక్ ఖాతా నిధులు మళ్లిస్తే పదేళ్లపాటు ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుందని హెచ్చరించింది. పెద్ద నోట్ల రద్దుకు ముందు, ఆ తర్వాత ఈ కంపెనీల ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలనూ తవ్వి తీస్తామన్నారు. ప్పటి వరకు రికార్డులు సమర్పించని కంపెనీలపైనే దృష్టి పెట్టిన ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిబంధనలు పాటిస్తున్న కంపెనీల ఆర్థిక వ్యవహారాలనూ తవ్వితీయబోతోంది. ముఖ్యంగా వీటి ¬ల్డింగ్ కంపెనీలు, వాటి నిధుల ప్రవాహాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని నిర్ణయించింది.