తనతో చర్చకు మోడీ భయపడుతున్నాడు
– మరోమారు రెచ్చగొట్టిన రాహుల్
న్యూఢిల్లీ,ఏప్రిల్ 9(జనంసాక్షి):కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీకి మరోసారి బహిరంగ సవాల్ విసిరారు. తనను తాను అవినీతిరహితుడిగా చెప్పుకుంటున్న మోదీ.. బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. ప్రధానిజీ.. అవినీతిపై నాతో చర్చకు భయపడుతున్నారా? విూ కోసం చర్చను మరింత సులభతరం చేస్తున్నాను. దీంతో విూరు సన్నద్ధమవడానికి వీలుగా ఉంటుందని రాహుల్ వ్యాఖ్యానించారు. అలాగే చర్చించాల్సిన మూడు అంశాలను కూడా ఆయన పేర్కొన్నారు. రఫేల్,అనిల్ అంబానీ, నీరవ్ మోదీ, అమిత్ షా,నోట్ల రద్దు అంశాలపై చర్చకు రావాలని కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా దేశ భద్రత, అవినీతి, విదేశాంగ విధానంపై చర్చకు రావాలని రాహుల్.. ప్రధాని మోదీకి సవాల్ విసిరారు. దీనిపై ఎటువంటి స్పందన రాకపోవడంతో తనతో చర్చకు భయపడుతున్నారా అంటూ ‘స్కేర్డ్ టు డిబేట్’ హ్యాష్ట్యాగ్తో మరోసారి ట్వీట్ చేశారు. రఫేల్ కొనుగోలు ఒప్పందంలో అవినీతి జరిగిందని..అనిల్ అంబానీకి లబ్ధి చేకూరేలా మోదీ వ్యవహరించారనీ రాహుల్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అంతకు ముందు భాజపా మేనిఫెస్టోపై స్పందించిన రాహుల్ ‘అది ఒక ఒంటరి వ్యక్తి గళం’ అని విమర్శించారు.
బీజేపీ మేనిఫెస్టో ఏకవ్యక్తి గళం
భాజపా మేనిఫెస్టో ప్రజాభిప్రాయం లేకుండా ఏక వ్యక్తి గళంతో తయారు చేశారని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. సోమవారం భాజపా మేనిఫెస్టోను విడుదల చేసింది. కాగా దీనిపై రాహుల్ మంగళవారం ట్విట్టర్లో స్పందించారు. భాజపా హావిూ పత్రం అహంకారపూరితంగా ఉందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో మాత్రం అందుకు భిన్నంగా, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఉందన్నారు. ‘కాంగ్రెస్ మేనిఫెస్టోను విస్తృత చర్చల ద్వారా రూపొందించామని, దాదాపు పది లక్షల మంది భారతీయుల గళమే మా మేనిఫెస్టో అని రాహుల్ అన్నారు. అది తెలివితో రూపొందించిన ఒక శక్తిమంతమైన హావిూ పత్రమని రాహుల్ ట్వీట్ చేశారు. అలాగే భాజపా మేనిఫెస్టోపై విమర్శలు కురిపించారు. ‘భాజపా మేనిఫెస్టోను ఒక గదిలో రూపొందించారని, అది అహంకారపూరితంగా ఉందని విమర్శించారు. హ్రస్వ దృష్టితో రూపకల్పన చేసిన ఈ మేనిఫెస్టో కేవలం ఒక ఒంటరి వ్యక్తి గళాన్ని మాత్రమే వినిపిస్తుందని ట్విటర్లో పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి భాజపా సోమవారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే అన్నారు. ‘సంకల్ప్ పత్ర’ పేరిట రూపొందించిన ఈ హావిూ పత్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఇప్పటికే ప్రకటించిన పీఎం కిసాన్ పథకంతో పాటు ఉమ్మడి పౌర స్మృతి అమలు, రామ మందిర నిర్మాణం, కశ్మీర్ ప్రత్యేక ¬దా రద్దు లాంటి పలు కీలక అంశాలను మేనిఫెస్టోలో చేర్చారు.