తెరిచిన “నోళ్ళు”.. దుర్గంధంలో ఇళ్లు..!!
బుడగజంగాల కాలనీ నుంచి ద్వారకానగర్ కు దుర్వాసన
పదిరోజుల నుంచి పొంగుతున్న డ్రైనేజీ
సుప్తావస్థలో బోడుప్పల్ శానిటేషన్ విభాగం
మేడిపల్లి – జనంసాక్షి
అసలే వర్షాకాలం.. సీజనల్ వ్యాధులు ప్రజ్వరిల్లే సమయం.. ఓవైపు అప్రమత్తంగా, శుచి శుభ్రతను పాటించాలని పదేపదే ప్రభుత్వం ప్రకటనలు చేస్తుండగా ఉన్నత స్థాయి అధికారులు సైతం అలర్ట్ అవుతున్నారు. వ్యాధులు ముసురుకోకుండా చర్యలు చేపడుతున్నారు. కానీ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. రోజుల తరబడి డ్రైనేజీలు పొంగిపొర్లి దోమలు వృద్ధి చెందుతున్నా శానిటేషన్ విభాగం చోద్యం చూస్తోంది. ఫలితంగా రోడ్లపై ఏరులై పారుతున్న మురుగు నీటితో ప్రజలు అడుగు బయట పెట్టాలంటేనే ఆలోచిస్తున్నారు.
మొన్నటివరకు బోడుప్పల్ పరిధిలోని మొదటి డివిజన్ లో ప్రధాన ఆలయం పోచమ్మ గుడి వద్ద పందులు మురుగు నీటిలో స్వైర విహారం చేసినా కొన్నిరోజుల పాటు మున్సిపల్ అధికారులు గానీ, సిబ్బందిగానీ అతి అటువైపు కన్నెత్తి చూడలేదు. చివరకు బోనాలు సమీపించడంతో హుటాహుటిన అక్కడ మురుగు నీటి సమస్యను పరిష్కరించే పనిలో ఉన్నారు. ఇలాంటి సమస్యే బోడుప్పల్ 8వ డివిజన్ లో తీవ్రంగా ఉన్నా నిర్లక్ష్యం ఇంకా వీడలేదు. బూడగజంగాల కాలనీ నుంచి ద్వారకా నగర్ ఫేస్ టుకు వెళ్ళే దారిలో దాదాపు పది రోజుల నుండి డ్రైనేజీలు లీకవుతున్నాయి. వరదలా నీరు పైకి ఎగజిమ్ముతూ.. కాలనీ రోడ్లపై ఏరులై ప్రవహిస్తోంది. కనీసం నడవడానికి కూడా ఆస్కారం లేకుండా మరీ అధ్వాన్నంగా తయారయ్యాయి పరిస్థితి..! తద్వారా తీవ్ర దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు బయటకి అడుగు పెట్టాలంటేనే అవస్థగా భావిస్తున్నారు. చిన్నారులు స్కూల్ కు వెళ్ళాలంటే కూడా ఫీట్లు చేయాల్సి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇలాంటి సమస్యను వెంటనే తీర్చాల్సిన పాలకవర్గం కానీ.. అటు అధికార యంత్రాంగం కానీ బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది చూసి పోతున్నారే తప్ప సమస్య పరిష్కారానికి కృషి చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Attachments area