తెలంగాణలో సర్పంచ్‌లు ఏం తప్పు చేశారు… సేవ చేయడమే వారి తప్పా?: హరీశ్ రావు

తెలంగాణలో సర్పంచ్‌లు ఏం తప్పు చేశారు? ప్రజలకు సేవ చేయడమే తప్పా? వడ్డీలకు డబ్బు తెచ్చి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు… అలాంటి వారిని ఇప్పుడు అరెస్ట్ చేయడం దారుణమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించాలంటూ రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం జేఏసీ సెక్రటరియేట్ ముట్టడికి పిలుపునిచ్చింది. అయితే వారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌లో అరెస్టైన సర్పంచ్‌లను పరామర్శించిన హరీశ్ రావు ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో పోలీసుల రాజ్యం నడుస్తోందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 8 నెలలైనా ఎనిమిది పైసలు కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వలేదన్నారు. కేంద్రం ఇచ్చిన రూ.500 కోట్లు కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యం లోపించిందని ధ్వజమెత్తారు.