దళితుడనే పరమేశ్వర్‌ను సీఎంను కానివ్వలేదు

– కాంగ్రెస్‌ పార్టీతో దళితులు సంతోషంగా లేరు
-కర్ణాటక బీజేపీ నేత ఎడ్యూరప్ప
బెంగళూరు, ఫిబ్రవరి25(జ‌నంసాక్షి) :  దళితుడిని కాబట్టే తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదంటూ కర్నాటక డిప్యూటీ సీఎం జి. పరమేశ్వర చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్ష బీజేపీ నేత బీఎస్‌ ఎడ్యూరప్ప సమర్థించారు. దళితులు కాంగ్రెస్‌ పార్టీతో సంతోషంగా లేరని ఆయన అన్నారు. ఇప్పటికే సంక్షోభంలో కొట్టిమిట్టాడుతున్న జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం.. పరమేశ్వర వ్యాఖ్యలతో మరింత ఇరకాటంలో పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎడ్యూరప్ప సోమవారం విూడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీతో దళితులు సంతోషంగా లేరని, తాను దళితుడిని కాబట్టే మూడు సార్లు సీఎం పదవి దక్కకుండా చేశారని ఆయన (పరమేశ్వర) చెప్పారన్నారు. కర్నాటక దళితులను కాంగ్రెస్‌ పార్టీ మోసం చేసిందని చెప్పేందుకు ఇంతకంటే నిదర్శనం ఏంకావాలని ఆయన పేర్కొన్నారు. కాగా పరమేశ్వర వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. దళితుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నది కాంగ్రెస్‌ పార్టీనే… ఇతర పార్టీలన్నీ సమాజంలోని అన్ని వర్గాలను నిర్లక్ష్యం చేశారు. ఏ సందర్భంలో పరమేశ్వర ఆ మాటలు చెప్పారో నాకు తెలియదు. ఈ వ్యవహారంపై విూరు ఆయన్ను అడగడమే మంచిదని పేర్కొన్నారు.