దాతృత్వం చాటుకున్న ఎఆర్‌ రహ్మాన్‌

కేరళకు కోటి రూపాయల విరాళం ప్రకటన

చెన్నై,సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి): ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌. రెహమాన్‌ దాతృత్వం చాటుకున్నారు. ఇటీవల వరదలతో అతలాకుతలం అయిన కేరళకు భారీ విరాళం అందించారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ ద్వారా తెలిపారు. తమ బృందంతో కలిసి కోటి రూపాయలను కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. రెహమాన్‌ ఆదివారం తన బృందంతో కలిసి అమెరికాలో సంగీత విభావరి నిర్వహించారు. ఈ సందర్భంగా కేరళకు సాయం అందిస్తున్న విషయాన్ని వేదికపై ప్రకటించారు. ‘నేను, నా ఆర్టిస్టులు అమెరికా టూర్‌లో పాల్గొన్నాం. కేరళ సోదర సోదరీమణుల కోసం మా వంతు సాయం చేశాం. ఈ చిన్న విరాళం విూకు కాస్త ఊరట ఇస్తుందని ఆశిస్తున్నాం’ అని రెహమాన్‌ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా చెక్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేశారు. ఈ టూర్‌లో భాగంగా ఇటీవల రెహమాన్‌ కేరళ వరద బాధితులను ఉద్దేశించి పాట పాడారు. ‘కేరళ, కేరళ, డోన్ట్‌ వర్రీ కేరళ’ అంటూ ఆ రాష్ట్ర ప్రజలకు ధైర్యం చెబుతూ పాడిన పాటకు మంచి స్పందన లభించింది. ఈ టూర్‌ పూర్తి చేసుకుని సెప్టెంబరులో రెహమాన్‌ భారత్‌ తిరిగి రానున్నారట. మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ‘నవాబ్‌’ సినిమా ప్రచారంలో పాల్గొననున్నట్లు సమాచారం. ఈ సినిమా ఆడియో విడుదల వేడుకలో రెహమాన్‌ ప్రదర్శన ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనేక మంది సినీ తారలు కేరళకు విరాళాలు అందించారు. షారుక్‌ ఖాన్‌, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌హాసన్‌, రజనీకాంత్‌, అల్లు అర్జున్‌, మమ్ముట్టి, ప్రభాస్‌, చిరంజీవి, రామ్‌చరణ్‌, మహేశ్‌బాబు, విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌, విజయ్‌ సేతుపతి, సిద్దార్థ్‌, ధనుష్‌, నయనతార, విశాల్‌ తదితరులు విరాళం అందించిన వారిలో ఉన్నారు.