దేశంలో డర్టీ పాలిటిక్స్‌ నడుస్తున్నాయి

– ప్రస్తుత నేతల్లో నరేంద్రమోదీనే ఉత్తమ నాయకుడు
– ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీచేయలేరు
– 2019లో ఏ రాజకీయ పార్టీకి మద్దతివ్వను
– నాకు రాజకీయ హద్దులు ఉన్నాయి
– ప్రముఖ యోగా గురువు రాందేవ్‌ బాబా
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి) : ప్రస్తుతం దేశంలో చెడు రాజకీయాలు నడుస్తున్నాయని, అధికార, ప్రతిపక్ష పార్టీలు అనుసరిస్తున్న తీరు ఆందోళనకరంగా ఉందని, ఇది దేశానికి మంచిది కాదని రాందేవ్‌ బాబా అభిప్రాయపడ్డారు. గురువారం జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న నాయకుల్లో సరైన వ్యక్తని భావిస్తున్న వారెవరు? అనే ప్రశ్న ఆయన ముందుంచగా ఈ విధంగా స్పందించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న నాయకుల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తమ నాయకుడని అన్నారు. ప్రతిపక్షాల్లో గానీ మరే ఇతర రాజకీయ పార్టీల్లోనూ ఆయనకు పోటీ వచ్చే వాళ్లెవరూ లేరన్నారు. ఆయన డైనమిక్‌ లీడర్‌ అని, ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని అన్నారు.
ఎన్నికల ప్రచారం గురించి మాట్లాడుతూ.. 2019ఎన్నికల్లో భాగంగా ఏ రాజకీయ పార్టీకి మద్దతివ్వనని, నాకు రాజకీయ హద్దులు ఉన్నాయన్నారు. ఉత్తమమైన భారత్‌ని తయారు చేసేవాళ్లకే నా మద్దతు ఉంటుందన్నారు. ప్రస్తుత దేశంలోని రాజకీయ వ్యవస్థ సరిగా లేదని, రాజకీయాలు విషయ ప్రధానంగా సాగుతాయన్నారు. రాజకీయ నాయకులకు అభివృద్ధి, విద్య, మౌలికసదుపాయాలు, విధివిధానాలు వీటన్నింటి విూద మంచి పట్టు ఉండాలన్నారు. ప్రస్తుతం దేశంలో డర్టీ పాలిటిక్స్‌ నడుస్తున్నాయని, అధికార, ప్రతిపక్షాలు రెండూ సరైన బాటలో నడవడంలేదన్నారు. ఇది దేశానికి ఎంత మాత్రం మంచిది కాదని రాందేవ్‌బాబా వ్యాఖ్యానించారు.