దేశభక్తికి అచ్చమైన నిదర్శనం..
బోరా వర్గానికి చెందిన ముస్లీంలే
– బోరా సమాజం శాంతి సందేశంతో జీవిస్తుంది
– ప్రధాని నరేంద్రమోడీ
ఇండోర్, సెప్టెంబర్14(జనంసాక్షి) : దావూదీ బోరా వర్గీయుల దేశభక్తి భారతీయులందరికీ ఆదర్శమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. ఇమామ్ హుస్సేన్ వర్థంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం నిర్వహించే ఆశారా ముబారకా కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ శుక్రవారం ఇండోర్ వచ్చారు. ఆశారా ముబారకాతో ఇస్లామిక్ సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈ కాలాన్ని మహ్మద్ ప్రవక్త మనవడు ఇమామ్ హుస్సేన్ గౌరవార్థం ఆయనకు అంకితం చేస్తారు. ఈ సందర్భంగా బోరా వర్గానికి చెందిన ఓ మసీదులో ప్రదాని పాల్గొని ప్రసంగించారు. బోరా సమాజం శాంతి సందేశంతో జీవిస్తుందని, ఈ శాంతి సందేశమే ప్రపంచం నుంచి మన దేశాన్ని ప్రత్యేకపరుస్తుందని ప్రధాని పేర్కొన్నారు. బోరా సమాజం దేశభక్తి భారతీయులందరికీ ఆదర్శమన్నారు. సయ్యద్నా ముఫ్దాల్ సైఫుద్దీన్ సైతం తన ప్రసంగాల్లో మాతృభూమిని ప్రేమించాలని బోధిస్తారని పేర్కొన్నారు. కాగా తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బోరా వర్గీయులతో సన్నిహిత సంబంధాలు ఉండేవని ప్రధాని గుర్తు చేసుకున్నారు. బోరా వర్గీయులు తన కుటుంబ సభ్యులు అని పేర్కొన్నారు. కాగా ఇక్కడికి వచ్చిన సందర్భంగా ఆయన బోరా మతపెద్ద సయ్యద్నా ముఫ్దాల్ సైఫుద్దీన్ను కూడా కలుసుకున్నారు. ప్రధానితో పాటు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా పాల్గొన్నారు. ఈఏడాది చివర్లో మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ ఇండోర్ పర్యటనకు విశేష ప్రాధాన్యం ఏర్పడింది. మైనారిటీకు మోదీ వ్యతిరేకమంటూ విపక్షాలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 2.5 లక్షల మంది దావూదీ బోరా వర్గీయులు ఉండగా.. ప్రత్యేకించి ఇండోర్, ఉజ్జయిని, బుర్హాన్పూర్ జిల్లాలో బోరా ప్రాబల్యం అధికంగా ఉంటుంది.