దేశానికి ఆదర్శంగా తెలంగాణ రైతు విధానాలు

అంతటా అమలు చేస్తే హరిత విప్లవం సాధ్యమే

రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్‌, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి

వరంగల్‌,జూన్‌20(జ‌నం సాక్షి): తెలంగాణలో సిఎం కెసిఆర్‌ అనుసరిస్తున్న రైతు విధానాలను భారతదేశ వ్యాప్తంగా అమలు చేస్తే దేశంలో హరితవిప్లవం సాధించవచ్చని రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్‌, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. రైతులకు సాగునీరు, పెట్టుబడి పథకం,బీమా పథకం అమలు చేయడం, పండిన ధాన్యం కొనుగోలు చేయడం వంటి పథకాలు పక్కాగా అమలయితే దేశంలో కరువు కాటకాలు ఉండవన్నారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడరని అన్నారు. ఇవన్నీ సాకారం చేసుకునే దిశగా తెలంగాణ ఒక్కో అడుగు వేస్తున్నదని, వేసిన అడుగు విజయవంగా సాగుతున్నదని అన్నారు. అవగాహన సదస్సులో పాల్గొనడానికి వచ్చిన గుత్తా ఆర్‌ఎన్‌ఎ ప్రతినిధితో మాట్లాడుతూ, రానున్న కాలంలో తెలంగాణ వ్యవసాయ రంగంలో ఓ రోల్‌ మాడల్‌గా నిలవబోతున్నదని అన్నారు. రైతుబీమా పథకం దేశానికే మార్గదర్శకంగా మారనుందని అన్నారు. వ్యవసాయాన్ని పండుగ చేయాలని తపిస్తున్న సిఎం కెసిఆర్‌ రైతును రాజు చేయడమే లక్ష్యంగా అనేకానేక చర్యలు తీసుకుని మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. రైతు సమన్వయ సమితిని ఏర్పాటు చేయడమే ఓఓ కీలక నిర్ణయమని అన్నారు. ఇలా వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. వ్యవసాయ రంగానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి, ప్రవేశపెట్టిన పథకాలు గురించి సీఎం కేసీఆర్‌.. ప్రధాని మోదీకి నీతిఆయోగ్‌లో వివరించడం ద్వారా రైతులను ఎలా ముందుకు తీసుకుని వెళ్లాలో పరోక్షంగా సూచించినట్టు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటూ వ్యవసాయరంగంలో నంబర్‌వన్‌ రాష్ట్రంగా నిలిచిందన్నారు. ఆగస్టు 15 నుంచి రైతుబీమా పథకాన్ని అమలులోకి తీసుకువస్తున్నారని, 18 నుంచి 60 ఏండ్ల వయస్సు ఉన్న రైతుకు బీమా వర్తింపజేస్తున్నట్టు చెప్పారు. దురదృష్టవశాత్తు, అనారోగ్యకారణాల వల్ల రైతు చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ.5 లక్షలు బీమా పరిహారం అందుతుందన్నారు.ఈ రకంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతు బీమా అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని అన్నారు. పెట్టుబడి పథకం కింద ఎలాగైతే రైతుబంధు పథకం పక్కాగా అమలయ్యిందో ఇప్పుడు బీమా పథకం కూడా పక్కాగా అమలు చేయడానికే జిల్లాల్లో పర్యటిస్తున్నామని అన్నారు. ఇప్పటికే సాగు పెట్టుబడి కోసం 57.47 లక్షల మంది రైతులకు రూ.4 వేల కోట్లు చెల్లించినట్టు చెప్పారు. 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల వారికి బీమా పథకాన్ని అమలు చేస్తామన్నారు. ప్రతి రైతుకు ప్రభుత్వం రూ.2,271 ప్రీమియం చెల్లిస్తున్నదని, ఏ కారణం చేతనైనా రైతు మరణిస్తే నామినీకి పది రోజుల్లో రూ.5 లక్షల ఇన్సూరెన్స్‌ అందుతుందని చెప్పారు. అందుకే ఈ పథకాలను తెలుసుకున్న దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు సీఎం కేసీఆర్‌ను కొనియాడుతున్నాయన్నారు. రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్‌ రైతు బీమా పథకాన్ని అమలులోకి తీసుకువచ్చారని గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఇప్పటికే నామినీల పేర్లు నమోదు చేయడం ప్రారంభమైందని, ఈనెల 30లోగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని వ్యవసాయాధికారులను ఆదేశించామని అన్నారు. ఆగస్టు 15న సీఎం కేసీఆర్‌ అధికారికంగా ప్రారంభిస్తారని తెలిపారు. ఎన్నడూలేని విధంగా పంటలకు మద్దతు ధర కల్పిస్తున్నామని, పక్క రాష్ట్రాల్లో సరైన మద్దతు ధర లభించని రైతులు కూడా తెలంగాణకు వచ్చి అమ్ముకుంటున్నారని తెలిపారు. పోడు భూముల్లో వ్యవసాయం చేసే రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. కాళేశ్వరం సహా చేపట్టిన అన్ని ప్రాజెక్టులు పూర్తయితే ఇక సాగునీటికి ఢోకా ఉండదన్నారు. ఇప్పటికే చెరువుల పునరుద్దరణ జోరుగా సాగుతోందన్నారు. దీంతో సేద్యం అన్నది రైతుకు భారం కాబోదన్నారు. దేశంలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అని పేర్కొన్నారు.