దొంగతనంపై నిలదీయడంతోనే బుకాయింపు

వేధింపుల కేసుపై స్పందించిన భానుప్రియ

చెన్నై,జనవరి24(జ‌నంసాక్షి): తనపై తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసుపై సినీ నటి భానుప్రియ స్పందించారు. తన కుమార్తెను వేధిస్తున్నారంటూ పండ్రవాడకు చెందిన ప్రభావతి అనే మహిళ భానుప్రియపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రభావతి చేసిన ఆరోపణలపై భానుప్రియ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇంట్లో పనిమనిషిగా ఉన్న సంధ్య తమ ఇంట్లో వస్తువులను చోరీ చేసినట్టు భానుప్రియ తెలిపారు. ఆ వస్తువులను తిరిగి ఇవ్వమని అడిగితే ప్రభావతి తమపై తప్పుడు కేసు పెట్టారని పేర్కొన్నారు. తమ ఇంట్లో వస్తువులను చోరీ చేసినందుకు సంధ్యపై చెన్నైలో కేసు నమోదు చేయనున్నట్టు వెల్లడించారు.దీనిపై సంధ్య మాట్లాడుతూ.. ‘భానుప్రియ, ఆమె సోదరుడు నన్ను బాగా చూసుకుంటున్నారు. వారికి తెలియకుండా నగలు, డబ్బు, ఎలక్టాన్రిక్‌ వస్తువులను దొంగిలించి మా అమ్మకు ఇచ్చాను. వస్తువులు చోరీకి గురైనట్టు వారు గమనించడంతో.. వాటిని తిరిగివ్వాలని మా అమ్మకు చెప్పాను. అయితే వాటిని తీసుకువస్తానని చెప్పిన అమ్మ.. తప్పుడు కేసు పెట్టింద’ని తెలిపారు.