నంబర్‌వన్‌గా తెలంగాణ అభివృద్ది

ఎమ్మెల్యే జలగం

భద్రాద్రి కొత్తగూడెం,జూలై2(జ‌నం సాక్షి): తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతున్నారని ఎమ్మెల్యే జలగం వెకట్రావ్‌ అన్నారు. బంగారుతెలంగాణ నిర్మాణమే ఏకైక లక్ష్యంగా కోటి ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి నిరంతరం పాటుపడుతున్నారన్నారు. త్వరలోనే ఇంటింటికీ నల్లాల ద్వారా మిషన్‌భగీరథ గోదావరి జలాలను అందిస్తామన్నారు. కనీస సౌకర్యాలకు నోచుకోలేని గ్రామాల్లో మినరల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ ద్వారా సుమారు రూ.30 కోట్ల వ్యయంతో కొత్తగూడెం నియోజకవర్గంలోని బొగ్గుగనుల ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు, రిటైనింగ్‌ వాల్స్‌, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలకు మౌలిక వసతులతో పాటు ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారన్నారు. ఎల్‌ఈడీ వీధిదీపాలను పంచాయతీలపై నయాపైసా భారం పడకుండా నియోజకవర్గ వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు.క్రీడాకారులను ప్రోత్సహించేందుకు పాల్వంచలో మినీ స్టేడియం నిర్మిస్తున్నామన్నారు. ప్రతిభావంతులైన క్రీడాకారులు కొత్తగూడెం జిల్లాలో ఉన్నారని, వారందరినీ జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. క్రీడాకారుల కోసం కొత్తగూడెంలో ప్రగతిమైదాన్‌ను, పాల్వంచలో మినీ స్టేడియంను తయారు చేశామన్నారు. నిరుద్యోగ యువతీ, యువకుల కోసం కొత్తగూడెం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను నెలకొల్పామన్నారు. వీటన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.