నాదే తప్పు.. కోర్టు అలా అనలేదు

– సుప్రింకు క్షమాపణలు చెప్పిన రాహుల్‌ గాంధీ
– కోర్టు ధిక్కరణ కేసులో సుప్రింలో అఫిడవిట్‌ దాఖలు
– నేడు విచారణ చేపట్టనున్న ధర్మాసనం
న్యూఢిల్లీ, ఏప్రిల్‌22(జ‌నంసాక్షి) :  కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పారు. రాఫెల్‌ విమానాల కొనుగోలు విషయంలో సుప్రీం ఇచ్చిన తీర్పును తాను తప్పుగా ప్రచారం చేశానని, అందుకు క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు తనపై నమోదైన కోర్టు ధిక్కరణ కేసులో రాహుల్‌గాంధీ సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. రఫేల్‌ తీర్పుపై తప్పుగా వ్యాఖ్యానించినందుకు ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచార జోరులో చేసిన వ్యాఖ్యల్ని ప్రత్యర్థి పార్టీలు సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని వివరించారు. తాను చేసిన వ్యాఖ్యల్ని కోర్టు ఎప్పుడూ పేర్కొనలేదని అఫిడవిట్‌లో అంగీకరించారు. కోర్టును రాజకీయాల్లోకి లాగే ఉద్దేశం తనకు లేదని తెలిపారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టనుంది.  రఫేల్‌ వివాదంపై సుప్రీంకోర్టు చేయని వ్యాఖ్యలను రాహుల్‌ పేర్కొన్నారని, తన అభిప్రాయాలను న్యాయస్థానానికి ఆపాదిస్తున్నారని ఆరోపిస్తూ భాజపా ఎంపీ విూనాక్షీ లేఖీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. రాహుల్‌కు నోటీసులు జారీ చేసింది. రాహుల్‌ గాంధీ అన్నట్లుగా తాము ఎప్పుడూ వ్యాఖ్యానించలేదని, అలాంటి అభిప్రాయాలను కూడా వెల్లడించలేదని కోర్టు పేర్కొంది. దీనిపై ఏప్రిల్‌ 22లోగా రాహుల్‌ సమాధానం ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. రఫేల్‌ ఒప్పందంపై ఇచ్చిన తీర్పును సవిూక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించిన విషయం తెలిసిందే. దీనిపై రాహుల్‌ స్పందిస్తూ.. ‘దేశం మొత్తం చౌకీదారే దొంగ అంటోంది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా న్యాయం గురించి మాట్లాడింది’ అని వ్యాఖ్యలు చేశారు. దీంతో విూనాక్షి లేఖీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కోర్టు తీర్పునకు రాహుల్‌ తన సొంత ఆరోపణలు ఆపాదిస్తున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.