నీరవ్ ఆస్తులను జప్త్
– రూ.637కోట్ల జప్తు చేసిన ఈడీ
న్యూఢిల్లీ, అక్టోబర్1(జనంసాక్షి) : పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ మోసానికి పాల్పడి దేశం విడిచి పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి ఈడీ షాక్ ఇచ్చింది. ఈ కేసులో ఈడీ తాజాగా మరిన్ని చర్యలు తీసుకుంది. నీరవ్, ఆయన కుటుంబసభ్యులకు చెందిన దాదాపు రూ.637కోట్ల ఆస్తులను జప్తుచేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది. భారత్ సహా ఐదుదేశాల్లో ఉన్న ఈ ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. భారత్, యూకే, అమెరికాల్లోని స్థిరాస్తులు, ఆభరణాలు, ఫ్లాట్లు, బ్యాంకు బ్యాలెన్స్లను, తదితర ఆస్తులను జప్తు చేసినట్లు చెప్పింది. దర్యాప్తులో భాగంగా భారత ఏజెన్సీలు విదేశాల్లోని నిందితుల ఆస్తులను జప్తు చేసిన కేసులు చాలా అరుదు. మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) ఆధారంగా కేంద్ర దర్యాప్తు సంస్థ నుంచి వచ్చిన వివిధ ఆదేశాల మేరకు నీరవ్ ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ వెల్లడించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఆదిత్య నానావటిపై ఇంటర్పోల్ రెడ్కార్నర్ నోటీసులు కూడా జారీ అయినట్లు తెలిపింది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో మోసానికి పాల్పడిన కేసులో వజ్రాల వ్యాపారులైన నీరవ్, మెహల్ ఛోక్సీ ప్రధాన నిందితులుగా ఉన్నారు. వీరు ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్నారు. ముంబయిలోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో వీరు దాదాపు రూ.13వేల కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడ్డారు.