నేడు ఏపీ మంత్రివర్గ ప్రమాణ స్వీకారం

– తాత్కాలిక సచివాలయం వెలుపల ఉ.11.49గంటలకు ప్రమాణం
– ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
– 1500 మంది పోలీస్‌ సిబ్బందితో పటిష్ఠ భద్రత
– ప్రమాణ స్వీకారం చేయించనున్న గవర్నర్‌ నర్సింహన్‌
అమరావతి, జూన్‌7(జ‌నంసాక్షి) : ఏపీ సీఎంగా జగన్‌ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి తదుపరి జరగాల్సిన కార్యక్రమాలు చకచకా జరిపోతున్నాయి. ఇప్పటికే పలు శాఖలపై సవిూక్షలతో బిజిబిజీగా గడిపిన జగన్‌.. కేబినెట్‌ ఏర్పాటుపై దృష్టిసారించారు. కాగా 25మందితో పూర్థిస్తాయి కేబినెట్‌ ఉంటుందని, వీరిలో ఐదుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీ వర్గాలకు చెందినవారు డిప్యూటీ సీఎంలుగా ఎంటారని జగన్‌ శుక్రవారం సంచలన ప్రకటన చేశారు. కాగా ఇప్పటికే కేబినెట్‌ విస్తృతపై కసరత్తు చేసిన సీఎం జగన్‌ 25మంది పేర్లను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. జగన్‌ మంత్రులుగా పేర్కొన్న వారికి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నేరుగా ఫోన్‌లు చేసి మంత్రులుగా ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించారు. కాగా
అమరావతి సచివాలయ ప్రాంగణంలో శనివారం ప్రమాణ స్వీకారం జరగనుంది. ఆంధప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విస్తృతమైన ఏర్పాటు జరుగుతున్నాయి. శనివారం ఉదయం 11.49 గంటలకు మంత్రులు పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నారు. వెలగపూడి తాత్కాలిక సచివాలయం వెలుపల మంత్రి వర్గం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి అక్కడ జరుగుతున్న పనులను వైసీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, గుంటూరు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పరిశీలించారు. సభావేదిక, గ్యాలరీలు, బారికేడ్లు, పార్కింగ్‌ తదితర ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజాప్రతినిధులు, అతిథులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. మంత్రివర్గ ప్రమాణస్వీకారంకు 5వేల మంది వస్తారని గుంటూరు జాయింట్‌ కలెక్టర్‌ హీమాన్షు శుక్ల తెలిపారు. రెండు మార్గాల్లో వేదిక వద్దకు ఆహ్వానితులను అనుమతిస్తామన్నారు. పాస్‌లు ఉన్నవారు వారికి కేటాయించిన గ్యాలరీల్లో కూర్చోవాలని సూచించారు. పాస్‌ లేకుండా సామాన్యులు ప్రమాణస్వీకారంకు హాజరుకావొచ్చన్నారు. అతిథులందరికి అల్పాహారం, తాగునీరు అందించేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. 1500 మందితో భద్రత ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
నేడు సచివాయంలోకి జగన్‌..
ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఉదయం 8.49 గంటలకు సీఎం చాంబర్‌లో అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు సీఎం చాంబర్‌ మొదటి బ్లాక్‌ను వాస్తుకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ సలహాదారు అజయ్‌ కల్లం, వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి చాంబర్‌ పనులను పరిశీలించారు. సచివాలయంలోని తన చాంబర్‌ను పలు విధాల మార్పులు చేసుకున్న జగన్‌, శనివారం శచివాలయంలోకి అడుగిడనున్నారు.