పద్మశాలి లందరికీ చేనేత భీమ వర్తింపజేయాలి
కౌడిపల్లి(జనంసాక్షి)..తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన చేనేత భీమా పథకాన్ని పద్మశాలి కులస్తులందరికీ వర్తింప చేయాలని కౌడిపల్లి మండల చేనేత పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు పిసికే నర్సింలు ప్రభుత్వాన్ని కోరారు.ఆదివారం మండల కేంద్రమైన కౌడిపల్లిలో జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని జిల్లా ఉపాధ్యక్షులు పి.శెట్టయ్య, డాక్టర్ పురుషోత్తంతో కలిసి మార్కండేయ మహర్షికి ప్రత్యేక పూజలు చేసి చేనేత పద్మశాలి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేనేత భీమా ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పద్మశాలిలందరికీ బీమా వర్తింపచేయాలని, సాగు భూమి లేకుండా రైతు బీమా లేని నిరుపేద పద్మశాలీలు గ్రామాల్లో అనేకమంది ఉన్నారని వారికి కూడా చేనేత భీమా వర్తింపచేయాలన్నారు. ప్రభుత్వం ఆగస్టు 15 నుండి కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరు చేయనుండగా 50 ఏళ్లు నిండిన పద్మశాలిలకు ఆసరా మంజూరు చేయాలన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరుతో పాటు కులవృత్తి చేసుకునే వారికి 100 శాతం సబ్సిడీతో రుణాలు ఇవ్వాలన్నారు. నేటికీ ఇంకా పద్మశాలీలు గ్రామాల్లో సైకిల్ పై తిరుగుతూ బట్టలు అమ్ముకొని జీవనం సాగిస్తున్నారని, వీరికి ప్రభుత్వం మత్స్యకారులకు టీవీఎస్ మోపైడ్స్ ఇచ్చిన మాదిరిగా సబ్సిడీపై మోపైడ్స్ ఇవ్వాలన్నారు. పద్మశాలిల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా యువత ఉపాధ్యక్షుడు సంభారపు తిరుమలేష్, చేనేత పద్మశాలి సంఘం నాయకులు భీమేష్, వెంకటేశం, పద్మ దుర్గయ్య, మంత్రి కృష్ణ, ఆంజనేయులు, రవి, శ్రీనివాస్, కోమటి సాలె సుధాకర్, నర్సింలు, రంగేశ్, శ్యాం కుమార్, కృష్ణ, పురుషోత్తం, వైకుంఠం తదితరులు పాల్గొన్నారు.
