పరీక్ష హాల్లో పాపాయి పుట్టింది!

గిరిధ్‌: నెలలు నిండినా కూడా పరీక్ష రాయాలనే తపనతో పరీక్ష హాలుకి వెళ్లిన ఓ మహిళకు అక్కడే ప్రసవమై పండంటి బిడ్డ జన్మించిన ఘటన ఝార్ఖండ్‌లోని గిరిధ్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ధనావర్‌లోని అదారా కళాశాలకు చెందిన భారతి కుమారి బీఏ మూడో సంవత్సరం చదువుతున్నారు. తన ఇంటికి 25కి.మీ.ల దూరంలోని సరియా కళాశాలలో ఆమె పరీక్ష కేంద్రం ఉంది. బిర్ని పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జిట్‌కుండి గ్రామం నుంచి ఆమె గతుకుల రోడ్డుపై ఆటోలో పరీక్ష కేంద్రానికి వచ్చారు.

పరీక్ష కొద్దిసేపట్లో ప్రారంభమవుతుందనగా భారతికి పురుటి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో కళాశాల సిబ్బంది సమీపంలోని నర్సింగ్‌ హోంకు ఫోన్‌ చేశారు. వారు కళాశాలకు వచ్చేసరికే భారతి బిడ్డకు జన్మనిచ్చేసింది. తర్వాత తల్లీబిడ్డల్ని ఆస్పత్రికి తరలించారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.