‘పల్లా’పై భూ కబ్జా ఆరోపణలు : కిషన్‌రెడ్డి

వరంగల్‌, మార్చి 20 : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై ప్రభుత్వ భూ ఆక్రమణ ఆరోపణలున్నాయని బీజేపీ తెలంగాణ అఽధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఘట్‌కేసర్‌ మండలం కొర్రెమలలో ఇంజినీరింగ్‌ కాలేజీ కోసం ఎకరం ప్రభుత్వ భూమిని పల్లా కబ్జా చేశారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని అన్నారు. పట్టభద్రుల ఓటర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బుద్ధిచెబితే ఆయన ఆకాశం నుంచి భూమి మీదకు వస్తారన్నారు. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదన టీడీపీ నుంచి తమకు రాలేదని, వస్తే ఆలోచిస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు.