పాకిస్థాన్‌కు ట్రంప్‌ ఊహించని షాక్‌

1.66 బిలియన్‌ డాలర్ల భద్రతా సహాయం నిలిపివేత

ఉగ్రవాద నిరోధక చర్యలు తీసుకోవడంలో పాక్‌ వైఫల్యం

వాషింగ్టన్‌,నవంబర్‌21(జ‌నంసాక్షి): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పాక్‌కు మరోమారు భారీ షాక్‌ ఇచ్చారు. అధ్యక్షుడి ఆదేశాలతో ఈ ఏడాది జనవరిలో 1.66 బిలియన్‌ డాలర్ల భద్రతా సహాయాన్ని పాక్‌కు అమెరికా నిలిపివేసినట్లు పెంటగాన్‌ వ్లెడించింది. ఈ విషయాన్ని రక్షణ శాఖ ప్రతినిథి కల్‌ రోబ్‌ మానింగ్‌ ధ్రువీకరించారు. అమెరికా నుంచి పాకిస్థాన్‌కు అందే 1.3 బిలియన్‌ డాలర్ల భద్రతా పరమైన సహకారాన్ని అగ్ర రాజ్యం నిలిపివేసింది. ట్రంప్‌ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా రక్షణశాఖ అధికార ప్రతినిధి విలేకరులకు ఈ మెయిల్‌ ద్వారా వెల్లడించారు. ఉగ్రవాద కార్యకలాపాల విషయంలో పాకిస్థాన్‌ వైఖరి మార్చుకోకపోవడంతోనే ఆ దేశానికి భద్రతా సహకారాన్ని నిలువరించి అమెరికా కఠిన నిర్ణయం తీసుకుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అల్‌ఖైదా చీఫ్‌ ఒసామా బిన్‌ లాడెన్‌ ఆచూకీ తెలిసినా కూడా పాక్‌ ప్రభుత్వం అమెరికాకు చెప్పలేదని ట్రంప్‌ ఆరోపించిన కొద్ది రోజులకే ఈ పరిణామం జరగడం గమనార్హం.

ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామని ఇంతకు ముందు పాక్‌ నేతలు అమెరికాకు చెప్పారు. కేవలం మాటలే కానీ ఆ దిశగా పాకిస్థాన్‌ కఠినమైన చర్యలు తీసుకోలేదు. దీనివల్ల పాక్‌ పొరుగు దేశాలు ఉగ్రవాదం వల్ల నష్టపోతున్నాయి. అందుకే అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. భద్రతా సహకారాన్ని నిలిపివేయడం పాక్‌కు గట్టి హెచ్చరిక లాంటిది. తాలిబన్‌, లష్కర్‌ ఏ తోయిబా వంటి ఉగ్ర సంస్థలపై ఒకవేళ పాక్‌ కఠిన చర్యలు తీసుకుంటే అఎ/-గానిస్థాన్‌లోనూ శాంతి పరిస్థితులు నెలకొంటాయి. ఇలాగే భారత్‌కు వ్యతిరేకంగా ఉండే ఉగ్ర సంస్థలనూ నిలువరిస్తే ఆ దేశంతో సత్సంబంధాలు ఏర్పడడమే కాకుండా మంచి ఆర్థిక పరమైన ప్రయోజనాలు పాక్‌ పొందవచ్చు. అని గతంలో రక్షణ విభాగంలో పని చేసిన డేవిడ్‌ సెడ్నీ ఓ జాతీయ వార్తా సంస్థతో అన్నారు. ఈయన ఒబామా హాయాంలో పాక్‌, అఫ్గానిస్థాన్‌ రక్షణ విభాగంలో డిప్యూటీ అసిస్టెంట్‌ సెక్రటరీగా పనిచేశారు. హక్కానీ నెట్‌వర్క్‌, తాలిబన్‌ ఉగ్ర సంస్థల కార్యకలాపాలు నిలువరించనందుకు గానూ గత సెప్టెంబరులో పాక్‌కు 300 మిలియన్‌ డాలర్ల మిలిటరీ సాయాన్ని ట్రంప్‌ సర్కారు రద్దు చేసిన సంగతి తెలిసిందే.గత ఒబామా పరిపాలనలో ఆఫ్గనిస్తాన్‌, పాకిస్తాన్‌, మధ్య ఆసియా దేశానికి డిప్యూటీ అసిస్టెంట్‌ సెక్రటరీగా వ్యవహరించిన డేవిడ్‌ సిడ్ని కథనం ప్రకారం పాకిస్తాన్‌కు సైనిక సహాయాన్ని నిలిపివేయడం అమెరికా నిరుత్సాహంలో ఉందని అనడానికి బలమైన సంకేతంగా పేర్కొన్నారు. పొరుగు దేశాల్లో విధ్వంసం సృష్టించడానికి పాక్‌ తీవ్రవాద సమూహాలను ప్రోత్సహిస్తుందని అమెరికా వాదనలు చేసినప్పటికీ ఆ దేశం ఎటువంటి తీవ్రమైన చర్యలు తీసుకోలేదని సిడ్నీ అన్నారు. అందువల్ల అమెరికా ప్రజలతో పాటు అధ్యక్షుడు కూడా నిరుత్సాహంలో ఉన్నారని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. పాక్‌ ప్రజలు అనుభవిస్తున్న బాధను ఈ నిరాశ విస్మరించదని అన్నారు. ఇతరుల బాధను ఆపి, సహాయం అందించాలని పాక్‌ను అమెరికా అడుగుతోందని అని సెంటర్‌ ఫర్‌ స్టాట్రజిక్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌ థింక్‌-ట్యాంక్లో సీనియర్‌ అసోసియేట్‌ పేర్కొంది.