పాక్‌ గాయకుడికి ఈడీ నోటీసులు

– విదేశీ కరెన్సీని భారత్‌కు స్మగ్లింగ్‌ చేస్తున్నాడని ఆరోపణలు
ఇస్లామాబాద్‌, జనవరి30(జ‌నంసాక్షి) : ప్రముఖ పాకిస్థానీ గాయకుడు రహత్‌ ఫతే అలీ ఖాన్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. గత మూడేళ్లుగా విదేశీ కరెన్సీని భారత్‌కు స్మగ్లింగ్‌ చేస్తున్నారంటూ ఆయనపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు ఎఫ్‌ఈఎంఏ (ఫారిన్‌ ఎక్స్‌ఛేంజ్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌) కింద ఆయనకు బుధవారం నోటీసులు జారీ అయ్యాయి. ఈ అక్రమాల ద్వారా ఆయనకు 340,000 డాలర్లు (దాదాపు రూ.2.42 కోట్లు) ముట్టాయని వాటి నుంచి 225,000 (రూ.1.6 కోట్లు) స్మగ్లింగ్‌ చేశారని ఓ విూడియా వెల్లడించింది. ఈ కేసుపై ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఒకవేళ ఈ నోటీసులకు ఖాన్‌ స్పందించకపోతే ఈడీ ఆయనపై జరిమానా విధిస్తుంది. జరిమానా చెల్లించకపోతే ఆయనపై లుకౌట్‌ నోటీసులు జారీ అవుతాయి. దాంతో ఆయన భారత్‌లో ఎక్కడా ప్రదర్శనలు ఇవ్వడానికి వీలుండదు. ఖాన్‌పై ఇలాంటి ఆరోపణలు రావడం ఇది మొదటిసారేం కాదు. 2011లో భారత్‌కు వస్తుండగా ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఆయన వద్ద 125,000 డాలర్లు (రూ.89.1 లక్షలు) లెక్కలోకి రాని నగదు ఉన్నట్లు తెలిసింది. దాంతో ఎయిర్‌పోర్ట్‌ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్‌కు చెందిన రహత్‌ ఫతే అలీ ఖాన్‌ తన గాత్రంతో భారత్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్నారు.