పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుంటా: బండి

హైదరాబాద్‌,ఆగస్ట్‌7(జనంసాక్షి): సెప్టెంబర్‌ 17న అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. తన పాదయాత్ర ద్వారా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో మునిగిపోయిందని, ప్రాజెక్టులు, కమిషన్లకే పరిమితమైందన్నారు. బర్కత్‌ పురాలోని హైదరాబాద్‌ సెంట్రల్‌ ఆఫీసులో పాదయాత్ర ప్రిపరేటరి సమావేశం జరిగింది. పాదయాత్రలో నడిచేందుకు వేల మంది కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని, కాని ప్రతి జిల్లా నుంచి 20 మందికి మాత్రమే అవకాశం కల్పించామని చెప్పారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడం, ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టడం, కుటుంబ పాలనను అంతమొందించడమే తన పాదయాత్ర ప్రధాన లక్ష్యమన్నారు. తన పాదయాత్రతో తెలంగాణలో పెను మార్పులు ఖాయమన్నారు సమావేశంలో పాదయాత్ర ఇంచార్జ్‌ గా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్‌ రెడ్డిని నియమించారు.