పారిశ్రామికంగా సిద్దిపేట అభివృద్ది
యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా చర్యలు
మలేషియాకు చెందిన డీఎక్స్ఎన్ కంపెనీకి శంకుస్థాపన
వ్యవసాయాధారిత పరిశ్రమలకు ప్రాధాన్యం
వెల్లడించిన మంత్రి హరీష్ రావు
సిద్దిపేట,సెప్టెంబర్4(జనం సాక్షి): సిద్దిపేట నియోజకవర్గం అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో ఉందని, అలాగే పరిశ్రమల ఏర్పాటులోనూ ముందుంటామని మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. పారిశ్రామికంగా అభివీద్ది చేయడం ద్వారా ఇక్కడి యువతకు పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు. మలేషియాకు చెందిన డీఎక్స్ఎన్ కంపెనీ సవిూకృత వ్యవసాయ ఆధార పరిశ్రమకు మంత్రి హరీశ్ రావు భూమి పూజ చేశారు. సిద్దిపేట అర్బన్ మండలం మందపల్లి శివారులో 50 ఎకరాల విస్తీర్ణంలో రూ.175 కోట్లతో ఈ కంపెనీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.డీఎక్స్ఎన్ కంపెనీ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నదని మంత్రి ప్రశంసించారు. కాలుష్య రహిత పరిశ్రమతో దాదాపు 1500 మందికి ఉద్యోగావకాశాలు కలుగుతాయన్నారు. సిద్దిపేటలో కొన్నేళ్లుగా అనుకున్న అన్ని పనులు చేసుకున్నా పరిశ్రమల ఏర్పాటులో కొంత ఆలస్యం అయిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు నీళ్లు, కరెంట్, రైల్వే లైన్, మంచి రహదారులు కావాలని,సీఎం కేసీఆర్ కృషితో సిద్దిపేట జిల్లాలో అవన్నీ సమకూర్చుకున్నామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 16 టీఎంసీల నీరు పరిశ్రమలకు కేటాయించుకున్నామని హరీశ్ రావు వెల్లడించారు. వ్యవసాయం, గృహ అవసరాలకు, పరిశ్రమలకు 24 గంటల కరెంట్ ఇస్తున్నది దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రం మాత్రమే నన్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ముందుచూపుతో పని చేస్తున్నారని చెప్పారు. గత ముఖ్యమంత్రులు ఆ రోజుకు తమకేం లాభమని ఆలోచిస్తే, సీఎం కేసీఆర్ భవిష్యత్ తరాల కోసం ఆలోచిస్తున్నారని అన్నారు. నంగనూర్ మండలం నర్మెటలో జపాన్ కు చెందిన ఎగ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కానున్నదని మంత్రి హరీశ్ ప్రకటించారు. సిద్దిపేటలో ఉన్న 22 మంది రైస్ మిల్లర్లకు కూడా ఇక్కడ స్థలం కేటాయిస్తున్నామని తెలిపారు. ఇక్కడ ఒకటి 100 ఎకరాల్లో ఫర్నిచర్ పార్క్, మరో వంద ఎకరాల్లో పశ్చిమ బెంగాల్ కు చెందిన శ్రేయిన్ ఫుడ్ పార్క్ రానున్నదన్నారు. ఈ ప్రాంతానికి రెండు జాతీయ రహదారులకు అనుసంధానం చేసే దిశగా రహదారులు నిర్మిస్తామని హరీశ్ ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావుతో పాటు టీఎస్ ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, వీసీ అండ్ ఎండీ ఈవీ నరసింహారెడ్డి, కలెక్టర్ కృష్ణభాస్కర్, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్ మ్లలెపల్లి లక్ష్మయ్య, డీఎక్స్ఎన్ కంపెనీ వ్యవస్థాపకుడు డాక్టర్ లిమ్ సివో జిన్, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.



