పార్థా ఛటర్జీని మమత ఎందుకు వెనకేసుకొచ్చినట్లు ?

అక్రమాలు జరిగినా ఎందుకు విచారణకు ఆదేశించలేదు
అడ్డంగా దొరికినా నంగనాచి కబుర్లతో ప్రజలను మభ్య పెడతారా
బెంగాల్‌ సర్వీస్‌ కమిషన్‌ కుంభకోణంపై సర్వత్రా విమర్శలు

కోల్‌కతా,జూలై27(జనంసాక్షి ): ప్రతిదానికీ నోరు పెద్దది చేసుకుని విమర్శలు గుప్పించే బెంగాల్‌ సిఎం మమతా బెనర్జీ తమ ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణంపై మాత్రం పెదవి విప్పడం లేదు. నోట్ల కట్టలు దొరికినా కిమ్మనడం లేదు. తేలుకుట్టిన దొంగలా వ్యవహారం మారుతున్నా పట్టించుకోకుండా అవినీతికి తాము వ్యతిరేకం అంటూ ప్రకటను మాత్రం ఇస్తున్నారు. బెంగాల్‌ అవినీతి కేసు బయటకు రాగానే
ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఆత్మరక్షణలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. పశ్చిమబెంగాల్‌ స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌ రిక్రూట్‌మెంట్‌ స్కామ్‌ విషయంలో ఒక పార్టీగా తృణమూల్‌ కాంగ్రెస్‌ రాజకీయ విమర్శలు చేస్తున్నది. సిఎం మమత మాత్రం గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. కుంభకోణంలో అడ్డంగా దొరికి ఓ మంత్రి అరెస్టు కావడం సిగ్గుచేటు. ఆయన దోచుకున్నదంతా దాచిపెట్టింది ఇక్కడేనంటూ ఇద్దరు మహిళల ఇళ్లల్లో నోట్ల కట్టలు పట్టుబడ్డాయి. మంత్రితో వారికి గల సాన్నిహిత్యం విూద విూడియా విశ్లేషణాత్మక కథనాలను ప్రసారం చేస్తున్నది. ఈ వ్యవహారాన్ని మమత చూసీచూడనట్లుగా ఉండడం చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయి. తీగలాగితే డొంక కదులుతుందా అన్న చందంగా ఆమె కిమ్మనడం లేదు. ఈ కుంభకోణం గురించి తనకు ఏమాత్రం తెలియదని చెప్పడం తప్పించుకోవడం తప్ప మరోటి కాదు. అవినీతిని సహించేది లేదనీ, తప్పుచేసినవారు శిక్షార్హులేనని ప్రకటించడం ద్వారా ఆమె ఈ పాపంతో తనకు సంబంధం లేదని చెప్పదల్చుకున్నారు. కేందప్రభుత్వాన్ని తప్పుబట్టగలిగేందుకు, దీనిని రాజకీయకక్షగా అభివర్ణించేందుకు ఆమె ప్రయాసపడుతున్నప్పటికీ అలా చేయడానికి ఆస్కారం లేకుండా పోయింది. ఎందుకంటే న్యాయస్థానం ఆదేశాలమేరకే కేందప్రభుత్వ సంస్థలు రంగంలోకి దిగాయి. ఆరేళ్ళక్రితం పార్థా చటర్జీ విద్యామంత్రిగా ఉన్నప్పుడు 13వేల గ్రూప్‌ సీ, డీ పోస్టుల భర్తీకి ఉద్దేశించిన ఉత్తర్వుతో ఈ కుంభకోణం మొదలైంది. అర్హుల జాబితా బహిరంగంగా ప్రకటించకుండా అభ్యర్థులు నేరుగా కంప్యూటర్‌లో లాగిన్‌ అయి ఫలితం తెలుసుకోవాలన్న నియమం పెట్టి, తక్కువమార్కులు వచ్చిన అభ్యర్థుల నుంచి డబ్బు తీసుకొని ఉద్యోగం ఇచ్చిన విషయం మిగతావారికి తెలియకుండా జాగ్రత్తపడ్డారు. కానీ, ఉద్యోగం దక్కని ఓ నలుగురు అభ్యర్థులు తమకంటే తక్కువ మార్కులు వచ్చిన కొందరిని గుర్తించి న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈ కుంభకోణం బట్టబయలయ్యింది. న్యాయస్థానంలో ఏళ్ళతరబడి వ్యవహారం కదలనీయకుండా, కొలిక్కిరాకుండా బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకుంది. నియామకపు పక్రియకు సంబంధించిన వివరాలు ఇవ్వకపోవడం, విజేతల జాబితా చూపకపోవడం వంటి చర్యలూ, కట్టుకథలూ న్యాయమూర్తిని తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. ఒక న్యాయమూర్తి పదవీకాలం పూర్తయి, కొత్త న్యాయమూర్తి వచ్చిన తరువాత కూడా కేసు కొనసాగింది. న్యాయస్థానం స్వయంగా
విచారణ కమిటీ ఏర్పాటు చేస్తే, వేలాది నియామకాలు అక్రమంగా జరిగాయనీ, ఎప్పటికప్పుడు ర్యాంకులు మార్చేశారనీ, పక్రియను పర్యవేక్షించే ప్యానెల్‌ కాలపరిమితి ముగిసిన తరువాత కూడా నియామకాలు జరిగాయని తేల్చింది. కొందరు నిరుద్యోగులు ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు, వేలాదిమంది ఉద్యమాలు చేసినప్పుడూ అన్యాయాన్ని సరిదిద్దుతానంటూ హావిూల వర్షం కురిపించిన మమత ఈ కుంభకోణం గురించి తనకు తెలియదని ఇప్పుడు చెప్పడం కేవలం తప్పించుకోవడానికి తప్ప మరోటి కాదు. పార్థాఛటర్జీ తన అరెస్టుకు ముందు నాలుగుసార్లు ఫోన్‌ చేసినా మమత పట్టించుకోలేదని ఇప్పుడు గొప్పగా చెబుతున్నారు కానీ, నియామకాల్లో అక్రమాల వివాదం హైకోర్టు మెట్లు ఎక్కగానే మమత జాగ్రత్తపడివుంటే న్యాయస్థానమే సీబీఐ విచారణకు ఆదేశించడం వరకూ వ్యవహారం వచ్చేది కాదు. ఇప్పుడు ఈడీ వరుసదాడుల్లో ఇద్దరు మహిళల ఇళ్ళలో కట్టలకొద్దీ బయటపడుతున్న అవినీతి సొమ్ముతో పాటు, వారితో ఆయనకున్న సాన్నిహిత్యం, ఆ కారణంగా వారు ఎదిగిన క్రమం వంటి అంశాల చుట్టూ ఈ కుంభకోణం తిరుగుతున్నది. పార్టీ జనరల్‌ సెక్రటరీ హోదాలో ఉంటూ, తన తరువాత కీలకమైన భూమిక నిర్వహిస్తున్న పార్థాచటర్జీని కాపాడుకునేందుకు ఆమె నానా తంటాలు పడ్డారన్నది ఇప్పుడు అర్థం అవుతోంది. ఆయన సంపాదించిన కోట్లాది రూపాయల విలువైన ఆస్తిపాస్తులు వరుసగా బయటపడుతున్న స్థితిలో కేందప్రభుత్వాన్ని రాజకీయంగా విమర్శించడం ద్వారా మమత తన పరువును పోగొట్టుకున్నారు.