పేదల కన్నీటిని తుడిచేందుకే ‘భూభారతి’

` రైతులు కోల్పోయిన భూములు వారికే చెందాలనే లక్ష్యంతో కొత్త చట్టం తెచ్చాం
` ధరణితో ఇష్టారీతిన భూ బదలాయింపులు
` పైసా ఖర్చు లేకుండా భూభారతిలో ఫిర్యాదులు
` తహసిల్దార్‌ పరిధిలో సమస్యలు పరిష్కారం
` ఉమ్మడి జిల్లాకు ఒక సిసిఎల్‌ఏ, ట్రిబ్యునల్‌ ఏర్పాటు
` వెంకటాపూర్‌లో భూభారతి అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటి
ములుగు(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం సామాన్య రైతులకు న్యాయం జరిగేవిధంగా ఉంటుందని, రైతుల కళ్లలో ఆనందం చూడటమే రాష్ట్ర ప్రభుత్వ లక్షమని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. భూ భారతి కార్యక్రమంలో పైలెట్‌ ప్రాజెక్టుగా చేపట్టిన ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో జిల్లా కలెక్టర్‌ దివాకర టిఎస్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన భూ భారతి రెవన్యూ సదస్సుకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, మంత్రి కొండా సురేఖ, సీతక్క, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు పోరిక బలరాం నాయక్‌, ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రామకృష్ణారావు, రెవెన్యూ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుద్ద ప్రకాష్‌ తదితరులు హాజరయ్యారు.భూ భారతి రెవెన్యూ సదస్సును ప్రారంభించిన అనంతరం మంత్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ దేశానికి వెన్నముక రైతు అని, రైతు లేనిదే రాజ్యం లేదన్నారు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో రైధరణి పోర్టల్‌ తీసుకువచ్చి గులాబీ నాయకులు ఇష్టా రీతిని వారి పేర్లపై వందల ఎకరాలు పట్టాలు చేయించుకుని, చట్టాన్ని చుట్టంగా మలుచుకుని రైతు బంధు పొందారు తప్పా సామన్య పేదరైతుకు న్యాయం జరిగిన దాఖలాలు లేవన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హావిూ మేరకు ప్రభుత్వం ఏర్పడగానే ధరణి పోర్టల్‌ ను బంగాళాఖాతంలో కలిపి సామాన్య రైతుకు శాశ్వత పరిష్కారం అయ్యే విధంగా భూ భారతి చట్టం తీసుకువస్తామని హావిూ ఇచ్చిన మేరకు భూ భారతి చట్టం తీసుకువచ్చామని అన్నారు. పైలట్‌ ప్రాజెక్టుగా ములుగు జిల్లాలోని వెంకటాపూర్‌ మండలాన్ని ఎంచుకున్నట్లు- తెలిపారు. గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో సాదా బైనామాద్వారా రైతులు పెట్టుకున్న దరఖాస్తులు రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల 24 వేలు ఆన్‌లైన్‌ లో ఉన్నాయని, అన్నింటికీ భూ భారతిలో అవకాశం కల్పించి రైతులకు న్యాయం జరిగేవిధంగా కృషి చేస్తామన్నారు. పేదల ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హావిూలను నెరవేర్చడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రైతులకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా భూ భారతి చట్టం రూపొందించి, చట్టం చేసిన 90 రోజుల్లోనే విధి, విధానాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భూ భారతి పోర్టల్‌లో రైతు సమస్యలపై దరఖాస్తు చేస్తే ముందుగా తహశీల్దార్‌ పరిధిలో ఉంటుందని, తహశీల్దార్‌ చేయకపోతే ఆర్డిఓ, అదనపు కలెక్టర్‌ సరిచేయాలని, కలెక్టర్‌ చొరవ తీసుకుని పరిష్కారం చూపాలని అన్నారు. ఉమ్మడి జిల్లాకు ఒక సిసిఎల్‌ఏ, ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయనున్నట్లు- అందులో సమస్యలకు పరిష్కారం అయ్యే విధంగా ఉంటుందని అన్నారు. రైతుల సమస్యలు పరిష్కారం కాకపోతే హైదరాబాద్‌లోని రెవెన్యూ కార్యాలయంలో టోల్‌ ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం అందించాలన్నారు. చట్టాన్ని అమలు చేసే బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. అధికారులు నిబద్ధతలో పనిచేయాలని, గ్రామాల్లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు- చేసి స్వయంగా కలెక్టర్లు వెళ్లి రైతుల సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. గత బిఆర్‌ఎస్‌ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు చెప్పిన మాట వినలేదని విఆర్వో, విఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేసి, 23 వేల మంది ఉద్యోగులను రోడ్డు పాలు చేసారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ భూములను కాపాడేందుకు ఒక అధికారి ఉండాలనే ఉద్దేశంతో తిరిగి గ్రామపాలనాధికారుల వ్యవస్థ తీసుకురావడం జరిగిందన్నారు. భూ భారతి కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామానికి రెవెన్యూ అధికారులు వచ్చి రైతుల సమస్యలు పరిష్కంచేందుకు కృషి చేస్తారన్నారు. ధరణి చట్టం చేసిన తర్వాత రెవెన్యూ సదస్సులు ఎందుకు పెట్టలేదని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. సదస్సులు పెడితే ధరణి బాధితులు విూ వీపులు పగలకొట్టేవారని బీఆర్‌ఎస్‌ నేతలను ఉద్దేశించి పొంగులేటి వ్యాఖ్యానించారు. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సాగు చేసుకుంటున్న రైతుల పేర్లకు బదులు, పింక్‌ షర్ట్‌ వేసుకున్న వాళ్లకు పట్టా పాసు పుస్తకాలు ఇచ్చింది గత కేసీఆర్‌ సర్కార్‌ అని ఆయన ఆరోపించారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రైతులు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలకు అక్కడున్న రైతులు హర్షం వ్యక్తం చేశారు. ధరణి పార్ట్‌ బీలో 18 లక్షల ఎకరాల భూములు ఉన్నాయని, పేదల ఆరున్నర లక్షల ఎకరాల భూమి అందులోనే ఉందని చెప్పారు. ఆ పేదల భూ సమస్యకు భూభారతి పరిష్కారం చూపుతుందని ఆయన హావిూ ఇచ్చారు. భూముల మ్యాప్‌లు ఉంటేనే రిజిస్టేష్ర్రన్‌ జరుగుతుందని, భూముల కొలతలకు, 6 వేల మంది సర్వేయర్లను సిద్దం చేస్తున్నామని చెప్పారు. భూభారతి చట్టానికి విధివిధానాలు ఖరారు చేశామని, ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల అభిప్రాయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని కళ్లముందుంచుకుని పనిచేస్తుందని స్పష్టం చేశారు. పేదలకు నిత్యం తోడుగా నిలబడే సంకల్పంతోనే ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని ఆమె తెలిపారు. పేదింటి బిడ్డలకు సన్నబియ్యం అందిస్తే.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ నేతలు అసహనంతో రెచ్చిపోతున్నారని ఆమె మండిపడ్డారు. పేదల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను చూసి వారు ఓర్చలేకపోతున్నారని మంత్రి సీతక్క ధ్వజమెత్తారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలపై అన్యాయం చేసిందని, ముఖ్యంగా భూ వ్యవహారాల్లో పేదలపై వివక్ష చూపిందని ఆమె ఆరోపించారు. భూములపై జరిగే అక్రమాలను అరికట్టేందుకే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని, గతంలో ’ధరణి’ పేరిట ప్రజలను మోసం చేశారని ఆమె వ్యాఖ్యానించారు. మేము తెచ్చిన కొత్త చట్టం ద్వారా భూములు అర్హులైన వారికే చేరేలా చర్యలు తీసుకుంటున్నామని, ఇది ఒక మంచి లక్ష్యంతో రూపొందించిన చట్టం అని సీతక్క వివరించారు. ఇల్లు లేని వారికి గృహ నిర్మాణం కల్పించాలన్నదే ప్రభుత్వం ముందున్న ముఖ్యమైన లక్ష్యమని, ప్రతి పేద కుటు-ంబం కుండపోత వర్షాల్లోనూ సురక్షితంగా ఉండేలా ఒక గుడిసె అయినా ఉండాలని అనుకుంటున్నామని మంత్రి సీతక్క తెలిపారు. గత ప్రభుత్వంలో వీఆర్వోలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని, చివరికి వారినే నిందించారని మంత్రి ఆరోపించారు. ఇప్పుడు కొత్త చట్టం అమలులో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, వర్థన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బానోత్‌ రవి చందర్‌, జిల్లా అటవీశాఖ అధికారి రాహుల్‌ కిషన్‌ జాదవ్‌, అదనపు కలెక్టర్‌ రెవెన్యూ సిహెచ్‌ మహేందర్‌ జి, జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.రెవెన్యూ అధికారులు, రైతులకు భూ భారతి అమలు తీరు, విడి విధానాలపై అవగాహన కల్పించారు.

తాజావార్తలు