పోలీసుల కాల్పుల్లో.. ఐటీ ఉద్యోగి మృతి
– యూపీలోని గోమతినగర్ ప్రాంతంలో అర్ధరాత్రి తర్వాత సంఘటన
– ఆత్మరక్షణార్థమే కాల్పులు జరిపామంటున్న పోలీసులు
– ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని మృతుని భార్య డిమాండ్
లక్నో, సెప్టెంబర్29(జనంసాక్షి) : ఐటీ ఉద్యోగి తొందరపాటు, పోలీసుల నిర్లక్ష్యం వెరసి ఓ నిండుప్రాణం బలైంది. అర్ధరాత్రి తనిఖీ సందర్భంలో వచ్చిన ఓ కారును నిలపలేదన్న కారణంతో దానిపై పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో అందులో ఉన్న ఐటీ ఉద్యోగి తీవ్రంగా గాయపడి అనంతరం ఆస్పత్రిలో మృతి చెందారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖ్నవూలోని గోమతినగర్ ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి 1.30గంటల తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. తివారి (38) అనే ఐటీ ఉద్యోగి ఆపిల్లో పనిచేస్తున్నారు. అర్ధరాత్రి కారులో తన సహచర ఉద్యోగిని మరొకరితో వస్తున్నాడు. గోమతినగర్ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో తివారి వస్తున్న కారును ఆపారు. అయితే తివారి కారు ఆపకుండా పోలీసుల ద్విచక్రవాహనాన్నిఢీకొట్టి ముందుకు పోనిచ్చాడు. దీంతో అనుమానం వచ్చిన కానిస్టేబుల్ కారుపైకి కాల్పులు జరపడంతో తివారికి బుల్లెట్ తగిలింది. దీంతో కారు అదుపుతప్పి సవిూపంలోని గోడను ఢీకొట్టింది. ఘటనపై కానిస్టేబుల్ ప్రశాంతకుమార్ వివరణ ఇచ్చాడు. కారులో ఉన్న వ్యక్తి అనుమానాస్పదంగా వ్యవహరించాడని, పైగామా బైక్ను ఢీకొట్టాడన్నారు. ప్రమాదాన్ని ఊహించి ఆత్మరక్షణార్థమే కాల్పులు జరిపాం అనిచెప్పాడు. తివారితోపాటు కారులో ప్రయాణిస్తున్నయువతి కథనం మరోలా ఉంది. ‘ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పోలీసులు బలవంతంగా మా కారును ఆపబోయారని, కారు ఆపుతున్నది ఎవరో అర్థంకాక సార్ (తివారి) వారిని తప్పించుకుని పక్కనుంచి వెళ్లే ప్రయత్నం చేశారన్నారు. ఈ క్రమంలో కారు వారి బండిని ఢీకొట్టిందని, వెంటనే బండిదిగిన కానిస్టేబుళ్ళలో ఒకరు రివాల్వర్ తీసి కాల్పులు జరిపాడని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై తివారి భార్య కల్పన తీవ్రంగా స్పందించారు. కారు ఆపనంత మాత్రాన కాల్చిచంపేస్తారా? పోలీసులకు ఎవరిచ్చారీ హక్కు? దీనిపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమాధానం చెప్పాలంటూ ఆమె డిమాండ్ చేశారు. కాగా వివేక్ బుల్లెట్ గాయాల వల్ల చనిపోయాడా, లేదంటే కారు గోడలోకి దూసుకెళ్లడం వల్ల తలకు గాయమై చనిపోయాడా అనే విషయం ఇంకా స్పష్టం కాలేదని పోలీసులు వెల్లడించారు.