ప్రజా సంక్షేమమే టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం

వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్

జూలూరుపాడు, ఆగష్టు 30, జనంసాక్షి: ప్రత్యేక
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని వైరా నియోజకవర్గ శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కొత్త పథకాలను ప్రవేశపెడుతూ అభివృద్ధిలో ముందకు సాగుతున్నారని అన్నారు. మండల పరిధిలోని పడమట నర్సాపురం రైతు వేదిక నందు పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు నూతనంగా ప్రభుత్వం మంజూరు చేసిన పెన్షన్ల పత్రాలను ఎమ్మెల్యే రాములు నాయక్ చేతులు మీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ప్రభుత్వం ప్రతి నెలా పెన్షన్ అందజేస్తూ వారికి ఆసరాగా నిలుస్తుందని అన్నారు. ఆసరా పెన్షన్లతో పాటు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, సిఎం రిలీఫ్ ఫండ్ వంటి పథకాలు నిరుపేద కుటుంబాలకు వరంలా మారాయని అన్నారు. ఇంతే కాక రైతుల కోసం ప్రత్యేకంగా అమలు చేస్తున్న రైతుబంధు, రైతు భీమా పథకాలు సైతం అన్నదాతకు అండగా ఉంటున్నాయని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ బంగారు తెలంగాణ లక్ష్యంగా ముఖ్యమంత్రి కెసిఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కట్రం మోహన్ రావు, ధారావత్ రోజా, బానోతు శాంతిలాల్, గుగులోతు రాందాస్, లావుడ్యా కిషన్ లాల్, ఎంపిపి లావుడ్యా సోని, జడ్పీటీసీ కళావతి, ఎంపిటిసిలు, సొసైటీ చైర్మన్ లేళ్ల వెంకటరెడ్డి, టిఆర్ఎస్ జిల్లా నాయకులు యల్లంకి సత్యనారాయణ, లకావత్ గిరిబాబు, రోకటి సురేష్, రామిశెట్టి రాంబాబు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు చౌడం నరసింహారావు, నున్న రంగారావు, ఎండీవో తాళ్లూరి రవి, ఎంపీవో రామారావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ వసంత్ కుమార్, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, పలు శాఖల అధికారులు, ఉద్యోగులతో పాటు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.