ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది
– సీఎం యోగిని కలిసిన టెకీ వివేక్ తివారీ కుటుంబ సభ్యులు
లక్నో, అక్టోబర్1(జనంసాక్షి) : పోలీస్ కానిస్టేబుల్ చేతిలో హతమైన యాపిల్ ఎగ్జిక్యూటివ్ వివేక్ తివారీ కుటుంబ సభ్యులు సోమవారం యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ను కలుసుకున్నారు. తమకు అన్నివిధాలా సాయం చేస్తామని సీఎం హావిూ ఇచ్చారని, ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందనే విశ్వాసం ఉందని వివేక్ తివారీ భార్య కల్పనా తివారీ అన్నారు. తాము చెప్పింది సావధానంగా విన్న ముఖ్యమంత్రి తమకు సాయం చేస్తామని భరోసా ఇచ్చారని, ప్రభుత్వం పట్ల తమకు పూర్తి విశ్వాసం ఉందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రితో భేటీ అనంతరం ప్రభుత్వంపై తమ నమ్మకం రెండింతలైందన్నారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు ఆపనందుకు
ఆగ్రహంతో శనివారం లక్నోలోని గోమతీపూర్ వద్ద పోలీస్ కానిస్టేబుల్ వివేక్ తివారీపై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఘటన జరిగిన సమయంలో తివారీతో ప్రయాణిస్తున్న కొలీగ్ సనా ఖాన్ ఫిర్యాదు మేరకు ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్ట్ చేశారు.కాగా, బాధితుడి కుటుంబంతో సీఎం యోగి ఆదిత్యానాథ్ గతంలో ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వం అన్ని విధాలా బాధిత కుటుంబాన్ని ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.