ప్రలోభాల కట్టడే లక్ష్యం

రైతుబంధు విషయమై సర్కారు విజ్ఞప్తి రాలేదు
4 సెట్ల నామినేషన్‌ దాఖలు చేయొచ్చు.. ఒక్కదానికే డిపాజిట్‌
యువ ఓటర్లను ఆకట్టుకునేలా కార్యక్రమాలు చేపడతాం
మీడియాతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ వెల్లడి
హైదరాబాద్‌ బ్యూరో, నవంబర్‌ 3 (జనంసాక్షి): ఎన్నికల్లో ప్రలోభాల కట్టడే లక్ష్యంగా చర్యలు తీసుకుంటామని  రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ వెల్లడి తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నవంబర్‌ 30వ తేదీన 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, మిగతా చోట్ల 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని చెప్పారు. అభ్యర్థులు గరిష్ఠంగా నాలుగు సెట్ల నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయొచ్చని.. డిపాజిట్‌ మాత్రం ఒక్కదానికే చెల్లించాలన్నారు. అఫిడవిట్‌లో అన్ని కాలమ్స్‌ తప్పనిసరిగా పూర్తి చేయాలన్నారు. అక్టోబరు 31వ తేదీ వరకు వచ్చిన ఓటు హక్కు దరఖాస్తులను నవంబరు 10వ తేదీ వరకు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఓటరు ఇన్‌ఫర్మేషన్‌ స్లిప్పులు ముందుగానే పంపిణీ చేయనున్నట్లు వికాస్‌ రాజ్‌ వెల్లడిరచారు.‘‘ఇప్పటికే 2 వేల పోలింగ్‌ కేంద్రాలు సిద్ధం చేస్తున్నాం. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్‌ శాతం తక్కువగా ఉంటోంది. ఈ సారి పట్టణ ప్రాంతాల్లోనూ ఓటింగ్‌ శాతం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఓటింగ్‌ శాతం పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడతాం. 18వేల వీల్‌ఛైర్లు ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో కొత్తగా 9.10 లక్షల మంది యువత ఓటు నమోదు చేసుకున్నారు. యువ ఓటర్లను ఆకట్టుకునేలా కార్యక్రమాలు తీసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం.ఇప్పటివరకు రూ.453 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నాం. మొత్తంగా 362 కేసులు, 256 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. సీ విజిల్‌ యాప్‌ ద్వారా 2,487 ఫిర్యాదులు వచ్చాయి. అనుమతుల కోసం 9,630 దరఖాస్తులు వచ్చాయి. 205 చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశాం. స్వాధీనం చేసుకున్న నగదుకు ఆధారాలు ఉంటే జిల్లా కమిటీల ద్వారా త్వరగా విడుదల చేయాలని ఆదేశించాం. వీలైనంత వరకు సామాన్యులకు ఇబ్బందులు లేకుండానే మార్గదర్శకాలు జారీ చేశాం’’ అని సీఈవో వికాస్‌ రాజ్‌ వెల్లడిరచారు.
పార్టీలపై అనుమానిత కేసులు
‘‘ఇప్పటివరకు 137 ఎంసీసీ ఉల్లంఘన కేసులు నమోదు అయ్యాయి. 13 భారాస, 16 కాంగ్రెస్‌, 5 భాజపా, 3 బీఎస్పీకి సంబంధించి అనుమానిత కేసులు ఉన్నాయి. రైతుబంధు విషయంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి విజ్ఞప్తి రాలేదు. ప్రలోభాలను కట్టడి చేయాలన్నదే ఈసీ లక్ష్యం. రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ సమాచారం ఆధారంగా ఆయా విభాగాలు చర్యలు తీసుకుంటున్నాయి. 375 కంపెనీలకు చెందిన కేంద్ర బలగాలు రాష్ట్రానికి వస్తాయి. నవంబర్‌ 2 తేదీ నాటికి ఓటర్ల సంఖ్య 3,21,88,753గా ఉంది’’ అని సీఈవో వెల్లడిరచారు.