ఫేసుబుక్‌ అరెస్టుల కేసులో న్యాయమూర్తిపై బదిలీ వేటు

ముంబయి : బాల్‌ థాకరే మృతి అనంతరం ముంబయి బంద్‌పై సామాజిక మీడియా ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యలు చేసిన ఇద్దరు మహిళలు అరెస్టయిన ఘటనలో ముంబయి హైకోర్టు ఓ న్యాయమూర్తిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యలు చేసిన ఇద్దరు మహిళలను జ్యుడిషియల్‌ కస్టడీకి ఆదేశించిన న్యాయమూర్తి రామచంద్ర బగాడేను పల్గార్‌ నుంచి జలగావ్‌కు హైకోర్టు బదిలీ చేసింది. మరోవైపు మహిళలపై పెట్టిన కేసులు కూడా సరియైనవి కావని, దీనిపై శాఖ సంబంధ దర్యాప్తు అవసరమని కొంకన్‌ రేంజీ ఐజీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు సమాచారం. శివసేన అధినేత థాకరే మృతి అనంతరం ముంబయిలో బంద్‌ పాటించడాన్ని ఇద్దరిలో ఓ మహిళ ఫేస్‌బుక్‌లో వ్యతిరేకించగా ఆ పోస్టును ఇంకో మహిళ లైక్‌ చేసింది. దీంతో గత సోమవారం ఇద్దరిని పోలీసులు 295(ఏ) సెక్షన్‌ కింద అరెస్టు చేశారు. అనంతరం వారు బెయిల్‌పై విడుదల అయ్యారు.