ఫ్రిజ్ కంప్రెషర్ పేలుడు: నలుగురు మృతి
భోపాల్,సెప్టెంబర్29(ఆర్ఎన్ఎ): మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో శనివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక దర్పణ్ కాలనీలోని ఓ ఇంట్లో ఫ్రిజ్ కంప్రెషర్ పేలిపోయింది. దీంతో ఇంటి గోడలు, పైకప్పు కుప్పకూలింది. ఈ ఘటనలో ఇంట్లోని నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను చికిత్స కోసం సవిూపంలోని ఆస్పత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో స్థానికంగా విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.