బలపరీక్షలో ఓడిన రాజపక్సే

– రాజపక్సేకు వ్యతిరేకంగా మెజార్టీ సభ్యులు ఓటు
కొలంబో, నవంబర్‌14(జ‌నంసాక్షి) : శ్రీలంక రాజకీయ సంక్షోభంలో అధ్యక్షుడు సిరిసేనకు షాక్‌ తగిలింది. పార్లమెంట్‌లో నిర్వహించిన విశ్వాస పరీక్షలో సిరిసేన ప్రధానిగా నియమించిన మహింద రాజపక్సే ఓడారు. బుధవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా.. రాజపక్సేకు వ్యతిరేకంగా మెజార్టీ సభ్యులు ఓటు వేశారు. దీంతో బలపరీక్షలో ఆయన ఓడిపోయినట్లు స్పీకర్‌ జయసూర్య ప్రకటించారు. పార్లమెంట్‌లో ప్రభుత్వానికి మెజార్టీ లేదని తెలిపారు. బలపరీక్ష తర్వాత పార్లమెంట్‌ బయటకు వచ్చిన రాజపక్సే కేబినెట్‌లోని కొంతమంది మంత్రులు స్పీకర్‌ జయసూర్యపై మండిపడ్డారు. స్పీకర్‌ పార్లమెంట్‌ నిబంధనల్ని ఉల్లంఘించి..
తమ మనోభావాలకు వ్యతిరేకంగా బలపరీక్ష నిర్వహించారని విమర్శించారు. అవిశ్వాస పరీక్షపై తమ అసంతృప్తిని తెలియజేశారు. శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన.. ప్రధానిగా ఉన్న రణిల్‌ విక్రమ సింఘేను ఉన్నట్టుండి తొలగించి.. రాజపక్సేను ఆ స్థానంలో నియమించారు. ఆ వెంటనే రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఈ నెల 9న పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. సిరిసేన నిర్ణయంపై స్టే విధించింది. వచ్చే ఏడాది జనవరి 5న ఎన్నికల నిర్వహించేందుకు చేస్తున్న ఏర్పాట్లను నిలిపివేయాలని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను డిసెంబరు 7కు వాయిదా వేసింది. అప్పటి పార్లమెంట్‌ రద్దుపై స్టే విధిస్తున్నట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది. పార్లమెంట్‌ రద్దుపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో.. స్పీకర్‌ జయసూర్య బుధవారం పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి.. రాజపక్సేకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టగా.. ఆయన ఓడిపోయారు.