బీఆర్‌ఎస్‌లోకి రండి

` పొన్నాలకు కేటీఆర్‌ ఆహ్వానం
` నేడు సీఎంను కలిసే అవకాశం
` పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం
` రేవంత్‌రెడ్డి కూడా ఎన్నో పార్టీలు మారారు
` మండిపడ్డ మంత్రి కేటీఆర్‌
` రేవంత్‌ తీరుతో కాంగ్రెస్‌ భ్రష్టు పట్టిందన్న పొన్నాల
హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. నేతలు.. ఆ గట్టు నుంచి ఈ గట్టుకు దాటి పోతున్నారు. తాజాగా కాంగ్రెస్‌లో సుదీర్ఘ అనుభవం కలిగిన సీనియర్‌ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య హస్తానికి గుడ్‌బై చెప్పారు. బిఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. రాజీనామా చేసి కొన్ని గంటలైనా గడవక ముందే బీఆర్‌ఎస్‌ పెద్దలు సంప్రదింపులు జరిపి.. కారెక్కించడానికి ప్రయత్నాలు మొదలెట్టారు. మంత్రి కేటీఆర్‌ స్వయంగా పొన్నాల ఇంటికి వెళ్లి బీఆర్‌ఎస్‌లోకి రావాలని ఆహ్వానించారు. మంత్రి ఆహ్వానాన్ని పొన్నాల కూడా స్వాగతించారు. కేటీఆర్‌ వెంట ఎమ్మెల్యే దానం నాగేందర్‌, దాసోజు శ్రవణ్‌, బీఆర్‌ఎస్‌ లీడర్లు పాల్గొన్నారు. పొన్నాలతో భేటీ తర్వాత కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ’బలహీన వర్గాల బలమైన గొంతుక పొన్నాలను బీఆర్‌ఎస్‌లోకి రావాలని ఆహ్వానించాను. సానుకూలంగా స్పందించారు. సీఎం కేసీఆర్‌ సూచన మేరకే వచ్చాను. సీఎం కేసీఆర్‌ను పొన్నాల కలుస్తారు. ఈనెల 16న జనగామలో జరిగే బహిరంగ సభలో పార్టీలో చేరాలని కోరాను. సీఎంను కలిశాక ఆయనే పూర్తి వివరాలు చెబుతారు. బీఆర్‌ఎస్‌లో పొన్నాలకు సముచిత గౌరవం ఇస్తాం. పొన్నాలపై పీసీసీ చీఫ్‌ చేసిన కామెంట్స్‌ బాధాకరం. బలహీన వర్గాల నేత వయసులో పెద్ద అలాంటి నేతపై రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్స్‌ను ఛీదరించుకుంటున్నారు. పార్టీలు మారిన నేతనే నీతులు చెబుతున్నారు. 40 ఏళ్లు పని చేసిన నేతకు ఇలాంటి అవమానాలు జరిగితే ఆ పార్టీలో ఎలా కొనసాగుతారు. పొన్నాలను పట్టుకుని సచ్చేముందు అని చిల్లర మాటలు ఎలా మాట్లాడుతారు’ అని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌తో భేటీ తర్వాత పొన్నాల విూడియాతో మాట్లాడుతూ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఫై మండిపడ్డారు. రాజకీయాల్లో పదవులు కో`ఆర్డినేషన్‌ కోసం మాత్రమే. రేవంత్‌ లాంటి దౌర్భాగుడి గురించి నేను మాట్లాడాను. కాంగ్రెస్‌ పార్టీని రేవంత్‌ లాంటి వాళ్లు భ్రష్టు పట్టిస్తున్నారు. రేవంత్‌ కాంగ్రెస్‌లోకి వచ్చాక అయన ఎమ్మెల్యే గా ఎందుకు గెలవలేదు?, పార్టీలో నేనొక్కడ్నే ఓటమి పాలయ్యానా?, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌ భార్య ఓడిపోలేదా?, అవమానాన్ని భరించలేకే పార్టీని వీడా. బీఆర్‌ఎస్‌లో చేరాలని కేటీఆర్‌ నన్ను కోరారు. రేపు సీఎం కేసీఆర్‌ను కలిసిన తర్వాత అన్ని వివరాలు చెప్తానని పొన్నాల పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. జనగామ బీఆర్‌ఎస్‌ టికెట్‌ పొన్నాలకు ఇవ్వొచ్చని ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగానే బీసీ నాయుకుడ్ని కలిసినట్లు పొలిటికల్‌గా చర్చ నడుస్తోంది. పొన్నాల బీసీ నాయకుడు కావడం.. పైగా రాజకీయ అనుభవం కలిగిన నేత అయి ఉండడం బీఆర్‌ఎస్‌కు కలిసొచ్చే అవకాశంగా భావిస్తోంది. పైగా గత కొద్ది రోజులుగా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి`పల్లా రాజేశ్వర్‌రెడ్డి మధ్య సీటు పంచాయితీతో కేడర్‌ అయోమయానికి గురైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయానికి ఎలాంటి తలనొప్పులు వస్తాయోనని గులాబీ పార్టీ అనుమానిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి గందరగోళం లేకుండా పొన్నాలకు సీటు ఇస్తే బాగుంటుందని బీఆర్‌ఎస్‌ ఆలోచన చేస్తోంది. ఇదలా ఉంటే పొన్నాలను బీఆర్‌ఎస్‌ లోకి రావాలని పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆహ్వానించారు. మరి ఏం జరగబోతుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీలోకి ఆహ్వానించారని, రేపు సీఎంను కలిసి తర్వాత తుది నిర్ణయం ప్రకటిస్తానని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. కేటీఆర్‌ వచ్చి తనను బీఆర్‌ఎస్‌ పార్టీలోకి ఆహ్వానించారని పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు రావాలని కేటీఆర్‌ కోరారు. రేపు కేసీఆర్‌ను కలిసిన తర్వాత వివరాలు తెలియజేస్తానని తెలిపారు. రేవంత్‌ రెడ్డి మాటలు సిగ్గు ఉండేవారు మాట్లాడేవేనా? అని ప్రశ్నించారు. తన బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటో రేవంత్‌ తెలుసుకోవాలని సూచించారు. పార్టీకి, ప్రాంతానికి చేసిన సేవలను కనుమరుగు చేశారు. రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలవలేదు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో రేవంత్‌ తన పార్లమెంట్‌ పరిధిలో ఎన్ని సీట్లు గెలిచారని ప్రశ్నించారు. ఐకమత్యమే పార్టీ బలం.. ఈ విషయం రేవంత్‌ మర్చిపోయారు. రేవంత్‌ రెడ్డి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు కదా? అని పొన్నాల లక్ష్మయ్య నిలదీశారు.