బీహార్‌లో 175మంది కానిస్టేబుళ్ల తొలగింపు

నితీశ్‌ సర్కార్‌ సంచలన నిర్ణయం

పాట్నా,నవంబర్‌5(జ‌నంసాక్షి): బిహార్‌ ప్రభుత్వం 175 మంది కానిస్టేబుళ్లను విధుల నుంచి పూర్తిగా తొలగించింది. పాట్నా పోలీస్‌ లైన్స్‌లో చోటుచేసుకున్న ఘర్షణపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. వీరితో పాటు 23 మంది పోలీసు ఉన్నతాధికారులను విధుల నుంచి తాత్కాలికంగా తొలగించింది. బీహార్‌ రాజధాని పాట్నాలో గడిచిన శుక్రవారంనాడు పోలీసు కమాండెంట్‌ను కింది స్థాయి ఉద్యోగులు చితకబాదారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తోటి మహిళా కానిస్టేబుల్‌కు కమాండెంట్‌ సెలవు ఇవ్వలేదు. దీంతో ఆమె చికిత్సకు దూరమై కన్నుమూసింది. పోలీసు ఉన్నతాధికారులపై దాడి, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడంతో వీరిపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు చేపట్టింది.