బ్లాక్‌ మనీని ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది

ఢిల్లీ : బ్లాక్‌ మనీని ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని ప్రముఖ సామాజిక కార్యకర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. కేంద్రం వద్ద నల్లధనానికి సంబంధించి జాబితా ఉన్నా ప్రభుత్వం నల్లధనాన్ని వెనక్కి రప్పించే ప్రయత్నం చేయడం లేదన్నారు. రాహుల్‌గాంధీ కోర్‌కమిటీ సభ్యురాలు అనుటాండన్‌కు స్విస్‌బ్యాంకులో రూ. 125 కోట్లు నల్లధనం ఉందని పేర్కొన్నారు. 700 మంది భారతీయులకు సంబంధించిన స్విస్‌బ్యాంకులో నల్లధనం ఉందని చెప్పారు. ఈ లిస్టు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత తనకు అందించినట్లు వివరించారు. ముకేష్‌, అనిల్‌ అంబానీలకు స్విస్‌ బ్యాంకులలో చెరో 100 కోట్లు పెట్టారన్నారు. మోటెక్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ రూ. 2100 కోట్లు, రిలయన్స్‌ కంపెనీ రూ. 500కోట్లు, నరేష్‌ గోయెల్‌ రూ. 80 కోట్లు, డాబర్‌ గ్రూప్‌ రూ. 25 కోట్లు నల్లధనం ఉన్నట్లు ఆయన బయటపెట్టారు. జెనీవాలోని హెచ్‌బీసీ సహకారంతో నల్లధనాన్ని స్విస్‌బ్యాంకు తరలిస్తున్నారని కేజ్రీ తెలిపారు. హెచ్‌బీసీలో భారతీయులకు సంబంధించిన నల్లధనం ఆరువేల కోట్ల రూపాయలుఉన్నాయని ఆరోపించారు.