భాజపాకు మరో భారీ షాక్‌

` కోమటిరెడ్డి రాజగోపాల్‌ రాజీనామా!
` త్వరలో కాంగ్రెస్‌లో చేరిక
హైదరాబాద్‌(జనంసాక్షి): మునుగోడు మాజీ ఎమ్మెల్యే, భాజపా నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. భాజపా ప్రకటించిన అభ్యర్థుల తొలి జాబితాలో ఆయన పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారనే ప్రచారం జోరందుకుంది.దీనిపై రాజగోపాల్‌రెడ్డి స్పందిస్తూ కాంగ్రెస్‌లో చేరికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఆ పార్టీలో చేరాలన్న ఒత్తిడి ప్రజల నుంచి ఉందని చెప్పారు. ఈ విషయంపై సాయంత్రంలోపు స్పష్టత వచ్చే అవకాశముంది.భాజపా వర్గాల సమాచారం ప్రకారం.. కాంగ్రెస్‌, కమ్యూనిస్టుల పొత్తుల్లో భాగంగా మునుగోడు నుంచి సీపీఐ బరిలో ఉంటే తాను పోటీ చేస్తానని రాజగోపాల్‌రెడ్డి అధిష్ఠానాన్ని కోరినట్లు తెలిసింది. లేదంటే తాను ఎల్‌బీ నగర్‌ నుంచి పోటీ చేస్తానని, మునుగోడులో తన భార్యకు టిక్కెట్‌ ఇవ్వాలని కోరగా.. మునుగోడు నుంచే బరిలో ఉండాలని రాజగోపాల్‌రెడ్డికి భాజపా స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో పోటీ నిర్ణయంపై తనకు కొంత సమయం కావాలని ఆయన కోరినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే రాజగోపాల్‌రెడ్డి పేరును ప్రకటించలేదని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నారనే ప్రచారం ఊపందుకుంది.