భారత్‌ను బలమైన ఆర్థిక శక్తిగా తయారు చేశాం

దేశాన్ని సర్వశక్తివంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
వ్యవస్థలను అపహాస్యం చేసిందే కాంగ్రెస్‌
అనేక గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించాం
మళ్లీ మెజార్టీతో అధికారంలోకి వస్తాం
లోక్‌సభలో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): 55 ఏళ్లకాంగ్రెస్‌ పాలనలో కన్నా తన 55 నెలల పాలనలో అనేక ఘనతలు ఉన్నాయని, దేశాన్‌ఇన మంచి మార్గంలో పయనించేలా చేశామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కాంగ్రెస్‌ తన పాలనా కాలంలో చేయని అనేకకార్యక్రమాలను సాకారం చేసి దేశం ముందుంచామని అన్నారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మాట్లాడుతూ కాంగ్రెస్‌ తీరును తూర్పారా పట్టారు. వారి పాలనా కాలపు లొసుగులను ఎద్దేవా చేశారు. రాష్టాల్ర హక్కులను హరించడం.. రాజకీయం కోసం రాష్ట్రపతి పాలన పెట్టడం కాంగ్రెస్‌కు అలవాటని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ టర్మ్‌లో లోక్‌సభలో మోదీకి ఇదే చివరి ప్రసంగం! ఈ సందర్భంగా ఎప్పుడూ లేనంతగా ఛలోక్తులు, జోకులతో మోదీ ప్రసంగించారు. దేశాన్ని సర్వశక్తివంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. నెహ్రూ, ఇందిరా హయాంలో.. కేరళ, బెంగాల్‌ హక్కుల్ని కాలరాశారని మోదీ పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ను కూడా కాంగ్రెస్‌ అలాగే కూలదోసిందన్నారు. సంపూర్ణ మెజార్టీ ఉన్న ప్రభుత్వం ఎంత పనిచేస్తుందో చూపించామని, అందుకే భారీ మెజార్టీతో మళ్లీ అధికారంలోకి రాబోతున్నామన్నారు.  వచ్చే ఎన్నికల్లో ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని ప్రధాని నరేంద్రమోదీ ఆకాంక్షించారు. ప్రజలకు నీతివంతమైన పాలన అందిస్తున్నామని అన్నారు. మొదటిసారి ఓటు వేసే యువతను ప్రోత్పహించాలని ప్రధాని సూచించారు. వచ్చే ఎన్నికల్లో ఆరోగ్యకరమైన పోటీ ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. భారత్‌ ను అనేక రంగాల్లో అగ్రగామిగా చేశాం. సమస్యలు, సవాళ్లకు ఎదురు నిలిచాం. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చామన్నారు. భారత్‌ లోనే ఎక్కువ సెల్‌ ఫోన్లు తయారవుతున్నాయి. భారత్‌లోనే అత్యధికంగా మొబైల్‌ డేటా వినియోగిస్తున్నారని ప్రధాని అన్నారు.
ఇదంతా తమ పాలనా ఘనత అని చాటారు. అనేక రంగాల్లో భారత్‌ను అగ్రగామిగా చేశామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.ప్రపంచంలోనే భారత దేశం అత్యధిక మొబైల్‌ డేటాను వినియోగిస్తుందని, భారత్‌లోనే ఎక్కువ సెల్‌ఫోన్లు తయారవుతున్నాయని వివరించారు. మోదీని విమర్శించే క్రమంలో భారత్‌కు అపఖ్యాతి తీసుకురావద్దని, ఖర్గే చేసిన విమర్శలు దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఉందన్నారు. లండన్‌ వెళ్లి భారత ప్రభుత్వంపై విమర్శలు చేయడం సమంజసమా అని ప్రశ్నించారు. సమస్యలు, సవాళ్లకు ఎదురుగా నిలబడ్డామని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చామని మోడీ కొనియాడారు. కాంగ్రెస్‌ పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, వాస్తవాలు చెప్పేవారు సభలో, బయట నిజాలే చెబుతారని, నిజాలు వినే అలవాటు కాంగ్రెస్‌కు లేదని దుయ్యబట్టారు.తాము వ్యవస్థలను నిర్వీర్యం చేశామనేది అవాస్తవమని, దేశ సైనికుల పట్ల కాంగ్రెస్‌ పార్టీ అగౌరవ వ్యాఖ్యలు చేసిందని, మోడీని ద్వేషించే క్రమంలో విపక్షాలు దేశాన్ని ద్వేషిస్తున్నాయని చెప్పారు. న్యాయ వ్యవస్థను కూడా భయపెట్టేలా కాంగ్రెస్‌ వ్యాఖ్యలు చేస్తుందని విమర్శలు గుప్పించారు. ఆర్టికల్‌ 352ను కాంగ్రెస్‌ ప్రభుత్వం నూరు సార్లు ప్రయోగించిందని, కేరళలో మొట్టమొదట కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూలదోసింది కాంగ్రెస్‌ పార్టీయే అని గుర్తు చేశారు. గత నాలుగేళ్లలో వ్యవసాయం, పెట్టుబడులు, అంకుర సంస్థలు, పాల ఉత్పత్తి వంటి అంశాల్లో అద్భుత ప్రగతి సాధించామని పేర్కొన్నారు. ఈ నాలుగేన్నరేళ్లలోనే ఆరో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించిందన్నారు. 11వ స్థానంలో ఉన్న భారత్‌ ఆరో స్థానానికి చేరితే విపక్షం ఎందుకు బాధపడుతోందని ప్రశ్నించారు. పది కోట్ల మంది ప్రజలకు మరుగుదోడ్లు నిర్మించామని, 2జి స్పెక్టమ్ర్‌ కేసులో వాస్తవాలు అందరికీ తెలుసునని, పేదల అభ్యున్నతి, దేశాభివృద్ధి కోసం ప్రభుత్వం పని చేస్తోందని మోడీ స్పష్టం చేశారు. ఎన్నో గ్రామాలకువిద్యుత్‌ వెలుగులు కల్పించామని అన్నారు. మోడీ ప్రసంగం సాగుతున్నంత సేపు అదికార పార్టీ సభ్యులు బల్లలు చరిచారు.