భారత్ బంద్ రోజూ.. ఆగని పెట్రోల్ ధరల దూకుడు
న్యూఢిల్లీ, సెప్టెంబర్10(జనంసాక్షి) : రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్న పెట్రోల్ ధరలకు నిరసనగా కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలు దేశవ్యాప్తంగా సోమవారం బంద్ చేపట్టాయి. దీంతో పలు రాష్టాల్లో జనజీవనం స్తంభించిపోయింది. అయితే మరో వైపు పెట్రలో ధరలు మాత్రం యథావిధిగా పెరుగుతూ పోతున్నాయి. బంద్ రోజున కూడా పెట్రోల్, డీజీల్ ధరల పెంపు కొనసాగింది. తాజా పెంపుతో పెట్రోల్ ధర ముంబయిలో రూ.90కి చేరువలోకి వచ్చింది. దేశరాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్పై 23 పైసలు, డీజిల్పై 22 పైసలు పెరిగింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.80.73, డీజిల్ రూ.72.83గా ఉంది. ఇక అత్యధికంగా ధరలు ఉండే ముంబయిలో పెట్రోల్ ధర రూ.88.12కి చేరగా.. డీజిల్ ధర రూ.77.32గా ఉంది. ఇక హైదరాబాద్లో నేడు లీటర్ పెట్రోల్ ధర రూ. 85.60, డీజిల్ ధర రూ. 79.22గా ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం లీటర్ పెట్రోల్పై రూ.19.48, డీజిల్పై రూ.15.33 ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తోంది. ఇక ఆయా రాష్ట్రాల్లో వీటిపై వ్యాట్ కొనసాగుతోంది. అండమాన్ నికోబార్ దీవుల్లో వ్యాట్ తక్కువగా(6 శాతం) ఉంది. ఇదిలా ఉండగా బంద్ నేపథ్యంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే పెట్రోల్, డీజిల్పై వ్యాట్ను 4 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆ రాష్ట్రంలో వీటి ధరలు రూ.2.5 తగ్గాయి.