భారత సంతతి మహిళలకు అత్యున్నత పురస్కారాలు

వాషింగ్టన్‌,నవంబర్‌20(జ‌నంసాక్షి): అమెరికాలో ఎనిమిది మంది భారత సంతతి మహిళలకు అత్యున్నత పురస్కారాలు లభించాయి. ఆయా రంగాల్లో సదరు మహిళలు అందించిన సేవలను అమెరికా ప్రభుత్వం గుర్తించింది. రాజకీయాలు, వ్యాపారం, మానవ హక్కులు, ఆస్టోఫ్రిజిక్స్‌ తదితర రంగాల్లో వారు అందించిన సేవలకు గాను అక్కడి ప్రభుత్వం ఉన్నత స్థాయి పురస్కారాలతో సత్కరించింది. ఇమ్మిగ్రేషన్‌ న్యాయవాది షీలా మూర్తి, ఏషియన్‌ అమెరికన్‌ ¬టల్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌(ఏఏహెచ్‌ఓఏ) వైస్‌ ఛైర్‌పర్సన్‌ జాగృతి పన్‌వాలా, డెమోక్రటిక్‌ పార్టీ ఫండ్‌రైజర్‌ అండ్‌ ఆర్ట్‌ కలెక్టర్‌ మహీందర్‌ టక్‌, నాసా ఆస్టోఫ్రిజిస్ట్‌ మధులిక గుహతకుర్తా తదితర మహిళలు పురస్కారాలు అందుకున్న వారిలో ఉన్నారు. మేరీల్యాండ్‌కు చెందిన రాజకీయ నాయకురాలు అరుణా మిల్లర్‌, ఫ్లోరిడాకు చెందిన వ్యాపారవేత్త మనీషా గైక్వాడ్‌, ఆంప్‌కస్‌ అనే టెక్నాలజీ కంపెనీ వ్యవస్థాపకురాలు, సీఈఓ ఆన్‌ రామకుమారన్‌, సౌత్‌ఏషియన్‌ అమెరికన్స్‌ లీడింగ్‌ టుగెదర్‌(సాల్ట్‌) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సుమన్‌ రఘునాథన్‌లకు పురస్కారాలు దక్కాయి. వీరికి అమెరికన్‌ బజార్‌ వుమెన్‌ ఎంటర్‌ప్రిన్యూర్స్‌ లీడర్స్‌ గాలాలో పురస్కారాలు అందజేయనున్నారు. మహిళా వ్యాపారవేత్తల గాలాకు దేశంలోని పలువురు ప్రముఖ మహిళలు, ఫార్చ్యూన్‌ 500 కంపెనీల ఎగ్జిక్యూటివ్స్‌, రాజకీయ నాయకులు, ఇతర నేతలు, స్వచ్ఛంద సంస్థల నేతలు, తదితరులు హజరవుతారు.