భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు..

  • ముంబయి: ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాల నేపథ్యంలో సోమవారం సరికొత్త రికార్డులు సృష్టించిన స్టాక్‌ మార్కెట్లు  నేడు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో సూచీలు అప్రమత్తంగా కదలాడుతున్నాయి. ఉదయం 9:36 గంటల సమయంలో సెన్సెక్స్‌ 2,134 పాయింట్ల నష్టంతో 74,334 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 846 పాయింట్లు నష్టపోయి 22,417 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.24 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో అన్ని షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, వవర్‌గ్రిడ్‌, ఎల్‌ అండ్‌ టీ, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, రిలయన్స్‌, టాటా మోటార్స్‌, ఐటీసీ, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు భారీ నష్టాల్లో ఉన్నాయి.

అమెరికా మార్కెట్లు  సోమవారం నష్టాలతో ముగిశాయి. నేడు ఆసియా-పసిఫిక్‌ సూచీలూ ప్రతికూలంగా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 77.85 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు  సోమవారం నికరంగా రూ.6,850 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు  సైతం రూ.1,914 కోట్ల వాటాలను కొన్నారు.