భూపాలపల్లి కోర్టు ఉత్తర్వులను కొట్టివేయండి
హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్, హరీశ్రావు
హైదరాబాద్(జనంసాక్షి): మేడిగడ్డ బ్యారేజీ కుంగిన వ్యవహారంలో భారాస అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. రాజలింగ మూర్తి ఫిర్యాదు మేరకు భూపాలపల్లి కోర్టు విచారణకు స్వీకరించి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. భూపాలపల్లి జిల్లా కోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ కేసీఆర్, హరీశ్రావు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా కేసీఆర్, హరీశ్రావు తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ జిల్లా కోర్టుకు విచారణార్హత లేకున్నా ఉత్తర్వులు జారీచేసినట్లు చెప్పారు. భూపాలపల్లి జిల్లా కోర్టులో ఫిర్యాదు చేసిన రాజలింగమూర్తి మృతి చెందినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విూడియా ద్వారా తనకు ఈ విషయం తెలిసిందని న్యాయమూర్తి చెప్పారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి మృతిచెందితే ఈ పిటిషన్పై ఎలా విచారణ చేపడతామని ప్రశ్నించారు. ఫిర్యాదుదారు మృతి చెందినా విచారణ కొనసాగించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరారు. ఈ మేరకు సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు ఉన్నాయన్నారు. వాదనలు వినిపించేందుకు గడువు ఇవ్వాలని కోరారు. అనంతరం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.