మణిరత్నం కార్యాలయానికి..  బాంబు బెదిరింపు

– ‘నవాబ్‌’ చిత్రంలోని అభ్యంతరకర డైలాగ్‌లు తొలగించాలని డిమాండ్‌
చెన్నై, అక్టోబర్‌2(జ‌నంసాక్షి) : ప్రముఖ దర్శకుడు మణిరత్నం కార్యాలయానికి బాంబు బెదిరింపులు వస్తున్నాయట. ఆయన దర్శకత్వం వహించిన ‘నవాబ్‌’ చిత్రం ఇటీవల విడుదలై వసూళ్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో కొన్ని సంభాషణలు అభ్యంతరకరంగా ఉన్నాయని వాటిని తొలగించాలని, లేదంటే కార్యాలయాన్ని బాంబుతో పేల్చేస్తామని గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం ఉదయం ఫోన్‌ చేసి బెదిరించారు. దీంతో భయబ్రాంతులకు గురైన కార్యాలయంలోని ఉద్యోగులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు మణిరత్నం కార్యాలయానికి  పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే దీనిపై మణిరత్నం నుంచి కానీ, చిత్రబృందం నుంచి కానీ ఎలాంటి స్పందన రాలేదు. తమిళంలో ఈ చిత్రం ‘చెక్క చీవంద వాణం’ టైటిల్‌తో విడుదలైంది. నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం రూ.30 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఓవర్‌సీస్‌లోనూ విజయఢంకా మోగిస్తోంది. ప్రకాశ్‌రాజ్‌, అరవింద్‌ స్వామి, సింబు, అరుణ్‌ విజయ్‌, విజయ్‌ సేతుపతి, జయసుధ, ఐశ్వర్యా రాజేశ్‌, అదితి రావు హైదరి ప్రధాన పాత్రలు పోషించారు.