మద్యం మత్తులో బీజేపీ నేత తనయుడి వీరంగం
– నిద్రిస్తున్న కార్మికులపైకి దూసుకెళ్లిన కారు
– ఇద్దరు కార్మికులు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
– జైపూర్లో విషాధ ఘటన
– కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
జైపూర్, సెప్టెంబర్1(జనం సాక్షి ) : పీకలదాకా మద్యం సేవించి, నిర్లక్ష్యంగా వాహనం నడిపిన ఓ బీజేపీ నేత కుమారుడు ఇద్దరు కార్మికులను పొట్టనబెట్టుకున్నాడు. మరో ఇద్దరు బాధితులు మృత్యువుతో పోరాడుతున్నారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో శుక్రవారం అర్థరాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. నిందితుడిని స్థానిక బీజేపీ కిసాన్ మోర్చా నేత బద్రి నారాయణ విూనా కుమారుడు భరత్ భూషణ్ విూనా (35)గా గుర్తించారు. భరత్తో పాటు అతడి మిత్రులంతా అధికమొత్తంలో మద్యం సేవించినట్టు పోలీసులు వెల్లడించారు. ఘటన జరిగిన తర్వాత భరత్ అతడి మిత్రులు పారిపోయేందుకు ప్రయత్నించగా.. స్థానికులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తొలుత గాంధీనగర్ రైల్వే స్టేషన్ సవిూపంలోని ప్లైఓవర్ కింద పేవ్మెంట్ను ఢీకొట్టిన నిందితులు.. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో భరత్ తన కారుపై నియంత్రణ కోల్పోవడంతో కారు అమాంతం ఫుట్పాత్పై నిద్రిస్తున్న కార్మికులపైకి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన నలుగురు కార్మికులను ఆస్పత్రిలో చేర్పించామనీ.. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం మృతిచెందారని పోలీసులు వెల్లడించారు. భరత్పై హత్యాయత్నం, మద్యం సేవించి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం సహా పలు అభియోగాల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. కాగాయాలతో ఆస్పత్రిలో చేరిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.