మళ్లీ క్షిణించిన పారికర్‌ ఆరోగ్యం

ఆస్పత్రిలో చేరిన గోవా సిఎం

పనాజీ,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): అనారోగ్యం నుంచి కోలుకుని ఇటీవల గోవా తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ మరోమారు అనారోగ్యం పాలయ్యారు. అస్వస్థతతో బీచ్‌ విలేజ్‌ అయిన కండోలిమ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఈ విషయాన్ని వెల్లడించింది. అనారోగ్యంతో ఆయన ఆసుపత్రిలో చేరినట్టు పేర్కొంది. అయితే, ఇంతకుమించి వివరాలు వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. ముఖ్యమంత్రి ఆసుపత్రిలో చేరిన విషయం నిజమేనని బీజేపీ నేత మైకెల్‌ లోబో పేర్కొన్నారు. కొన్ని నెలల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైన మనోహర్‌ పారికర్‌ అమెరికాలో చికిత్స తీసుకున్నారు. ఆరోగ్యం కుదుటపడడంతో ఈ నెల 6నే ఆయన అమెరికా నుంచి తిరిగి వచ్చారు. అంతలోనే మళ్లీ ఆసుపత్రిలో చేరడంతో నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గణెళిశ్‌ చవితి వేడుకల్లోనూ పారికర్‌ పాల్గొనలేదు.