మళ్లీ మోడీయే ప్రధాని

ప్రశాంత్‌ కిషోర్‌ వెల్లడి
పాట్నా,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): మళ్లీ నరేంద్ర మోదీయే ప్రధాని అవుతారంటూ ఎన్నికల వ్యూహకర్త, జనతాదళ్‌ యునైటెడ్‌(జేడీయూ) జాతీయ ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌ కిశోర్‌ అభిప్రాయపడ్డారు. 2019 ఎన్నికల్లో ఎన్డీయే కూటమే అధికారంలోకి వస్తుందంటూ వ్యాఖ్యానించారు. జేడీయూ అధ్యక్షుడు నితీశ్‌ కుమార్‌ ఎన్డీయేలో కీలక నేత అయినప్పటికీ ఆయన ప్రధానమంత్రి రేసులో ఉండరన్నారు. భాజపాకు పూర్తి మెజార్టీ రానప్పటికీ నితీశ్‌ అభ్యర్థిత్వం సాధ్యం కాకపోవచ్చునన్నారు. నితీశ్‌ కుమార్‌ ఎన్డీయేలో ఒక పెద్ద నేత. బిహార్‌ లాంటి రాష్టాన్ని 15 ఏళ్ల పాటు పాలించిన ఘనత ఆయనకు ఉంది. అయితే ప్రధాని స్థానంలో ఇప్పుడే ఆయనను ఊహించుకోవడం సమంజసం కాదు. నరేంద్ర మోదీయే ఎన్డీయే ప్రధాని అభ్యర్థి. రానున్న ఎన్నికల్లో గెలిచి.. మోదీ తిరిగి ప్రధాని పదవి చేపడతారని ప్రశాంత్‌ వివరించారు. గత సెప్టెంబరులో జేడీయూలో చేరిన ప్రశాంత్‌ ఇటీవల శివసేన అధ్యక్షుడు ఉద్దవ్‌ ఠాక్రేను ముంబయిలో కలవడంపై పలు ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య పొత్తు ఉండదని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో శివసేనకు వ్యూహకర్తగా పనిచేయడం అసాధ్యమన్నారు. ఒక పార్టీలో సభ్యునిగా ఉంటూ మరో పార్టీకి పనిచేయడం కుదరదన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీకి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్‌ కిశోర్‌ పనిచేశారు. అనంతరం జేడీయూకు కూడా తన వ్యూహాలను అందించారు. ఆంధ్రప్రదేశ్‌లో వైకాపాకూ తన సేవలను అందించారు.