మహిళ చేతిలో మైకు లాక్కున్న సిద్దరామయ్య

వివాదాస్పదం అవుతున్న చర్య

బెంగళూరు,జనవరి28(జ‌నంసాక్షి): కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య వరుసగా వివాదాలకు కారణమవుతున్నారు. కార్యకర్తల సమావేశంలో సహనం కోల్పోయారు. మహిళ చేతిలోనుంచి సిద్ధరామయ్య మైకును లాక్కున్నారు. అదే సమయంలో ఆమె చున్నీ కూడా మైక్‌తో వచ్చేసింది. ఈ సంఘటన కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపింది. ఒక వైపు ఏఐసీసీ అధ్యక్షుడు మహిళా స్త్రీ సాధికారత గురించి మాట్లాడుతుంటే ఒక మాజీ ముఖ్యమంత్రి మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించడంపై ప్రతిపక్షాలు విమర్శించాయి. మైసూర్‌కు చెందిన ఎమ్మెల్యే యతీంద్రను కలుసుకునే వీలు రావడం లేదని మాజీ సీఎం ముందు ఓ మహిళ వాపోయింది. ఆ సమయంలో తన సహనాన్ని కోల్పోయిన సిద్ధిరామయ్య.. ఆ మహిళ చేతిలో ఉన్న మైక్‌ను లాక్కునే ప్రయత్నం చేశారు. అయితే మైక్‌తో పాటు ఆమె చున్నీ కూడా ఊడి వచ్చింది. ఇదంతా ఓ వీడియోకు చిక్కింది. ఆ మహిళపై మాజీ సీఎం కూడా ఆగ్రహంగా నోరు పారేసుకున్నారు. అయినా ఆ మహిళ పట్టించుకోకుండా మాజీ సీఎంపై ప్రశ్నల వర్షం కురిపించింది. అక్కడున్న మిగితావారంత ఆమెను నివారించే ప్రయత్నం చేశారు. ఈ ఘటన పట్ల ఆ రాష్ట్ర బీజేపీ సీరియస్‌ అయ్యింది. కౌరవుల ప్రభుత్వంలో సిద్ధరామయ్య దుశ్యాసనుడిలా ప్రవర్తించారని విమర్శించింది.