మినీ అంగన్‌వాడీలకు జీతాలు పెంచాలి

మేనకాగాంధిని కలసి విన్నవించిన ఉద్యోగులు
న్యూఢిల్లీ,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): కేంద్ర మంత్రి మేనకా గాంధీని తెలంగాణ మిని అంగన్‌వాడీ టీచర్లు కలిసారు. అంగన్వాడీలతో సమానంగా పనిచేయడంతో పాటు అదనంగా ఆయా పనులను కూడా చేస్తున్న తమకు వేతనాలు, సెలవుల విషయంలో  తీవ్ర అన్యాయం జరుగుతోందని వారు వాపోయారు.  అంగన్‌ వాడీలకు 10 వేల 500 జీతం ఇస్తే, మాకు మాత్రం ఆయాలతో సమానంగా 6 వేల జీతం ఇస్తున్నారనీ., అంగన్‌ వాడీ టీచర్లతో సమానంగా తమకు కూడా వేతనాలు, సెలవులు ఇవ్వాలని కేంద్ర మంత్రిని మిని అంగన్వాడీలు కోరారు. ఈ సందర్భంగా ..త్వరలో కేంద్ర ఆర్థిక శాఖ కు మిని అంగన్‌ వాడీ వేతనాలు పెంచేలా ప్రతిపాదనలు పంపిస్తామని కేంద్ర మంత్రి మేనకా గాంధీ హామి ఇచ్చారు. త్వరలోనే తిపి కబురు వింటారని సమస్యలన్నీ పరిష్కరిస్తామని వారికి కేంద్ర మంత్రి భరోసానిచ్చారు.