మిర్యాలగూడ జిల్లాగా ప్రకటించకపోతే వేలాది మంది మునుగోడులో పోటీ చేస్తాం:-
జిల్లా సాధన సమితి నాయకులు…
మిర్యాలగూడను జిల్లాగా ప్రకటించకపోతే మునుగోడులో జరగనున్న ఉప ఎన్నికలలో మిర్యాలగూడ సాధన సమితి ఆధ్వర్యంలో భారీ మొత్తంలో నామినేషన్లు వేసే పోటీ చేస్తామని మిర్యాలగూడ జిల్లా సాధన సమితి నాయకులు నల్గొండ జిల్లా ఎంపీటీసీల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జంసాయి, ఎంఐఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఫారుక్, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి, ఎస్సీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాడుగుల శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లా ఏర్పాటు ఆకాంక్ష మిర్యాలగూడ,నాగార్జునసాగర్,హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలోని ప్రజల అందరి ఆకాంక్ష అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన సమయంలో అతిపెద్ద ప్రాంతమైన మిర్యాలగూడను జిల్లాగా ప్రకటించాల్సి ఉన్నప్పటికీ కావాలనే నిర్లక్ష్యం చేశారన్నారు. జిల్లా ఏర్పాటుకోసం ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారని అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే దాని పరిణామాలు ఉప ఎన్నికలపై పోవడం ఖాయమన్నారు. అన్ని రకాల వనరులు, భౌగోళిక స్వరూపం, రోడ్లు రహదారులు అంతర్జాతీయ రహదారులు మిర్యాలగూడ నుండి పోతున్నప్పటికీ జాప్యం చేశారని అన్నారు. ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకపోతే మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు పరిధిలోని నాగార్జునసాగర్ మిర్యాలగూడ హుజూర్నగర్ నియోజకవర్గాల నుండి వేలాది మంది స్వచ్ఛందంగా నామినేషన్ వేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 34వ జిల్లాగా మిర్యాలగూడ ప్రకటించాలని డిమాండ్ చేశారు. మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు జిల్లా ఏర్పాటుపై ప్రజల ఆకాంక్షను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మునుగోడు సభలో జిల్లా ఏర్పాటును ప్రకటింపచేయాలని కోరారు. విలేకర్ల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాగార్జునసాగర్ నియోజకవర్గ నాయకులు వాంకుడోత్ పాండు నాయక్, టిఆర్ఎస్వి జిల్లా ఉపాధ్యక్షులు శేఖర్,BMP జిల్లా కార్యదర్శి వజ్రగిరి అంజయ్య, బీసీ సంఘం పట్టణ అధ్యక్షులు బంటు వెంకటేశ్వర్లు,యాదవ సంఘం డివిజన్ ప్రధాన కార్యదర్శి చేగొండి మురళి యాదవ్,KVPS నాయకులు కోడిరెక్క మల్లయ్య, మోసిన్ఆలీ,నాగరాజు,దశరధ నాయక్ తదితరులు పాల్గొన్నారు.