దిల్లీ: రంజాన్ నెల నేటి నుంచి ప్రారంభం కావడంతో ముస్లిం సోదరులందరికీ దేశ ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర మాసంలో దేశంలో సోదరభావం, సామరస్యం పెరగాలని ప్రజల మధ్య స్నేహ పూర్వక వాతావరణం నెలకొనాలని ఆకాంక్షించారు. ఈ విషయమై ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. మంగళవారం నుంచి దేశ వ్యాప్తంగా రంజాన్ పవిత్ర ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. దీంతో మోదీ అమెరికా పర్యటనలో ఉన్నా ట్విట్టర్ ద్వారా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ నెలని రమాదన్ అని కూడా వ్యవహరిస్తారు. ఇస్లామిక్ క్యాలెండర్లో తొమ్మిదో నెలను రంజాన్ మాసంగా జరుపుకొంటారు. గల్ఫ్ దేశాల్లో, కేరళలో నిన్నటినుంచే రంజాన్ ఉపవాసాలు ప్రారంభమయ్యాయి.