మోడీ రాకను విమర్శించి అరెస్టయిన నందినిని విడుదల చేసిన పోలీసులు
చెన్నై,ఫిబ్రవరి12 జనంసాక్షి): తమిళనాడు రాష్ట్ర పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వెళ్లిన సందర్భంలో విమర్శలు చేసిన లా కళాశాల విద్యార్థిని నందినిని పోలీసులు విడుదల చేశారు. మోడీ రాక సందర్భంగా అరెస్టు చేసిన పోలీసులు అదేరోజు రాత్రి విడుదల చేశారు. ఈవీఎంలు లేకుండా బ్యాలెట్ పేపర్తో నిజాయితీగా ఎన్నికలు జరిపేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఎందుకు జంకుతున్నారని ప్రశ్నిస్తూ ఆమె ఆందోళన చేపట్టింది. ఇదే విషయంపై సోషల్ విూడియాలో కూడా మోదీని ఆమె విమర్శించింది. అంతేకాక తన తండ్రితో చెన్నై నుంచి ద్విచక్రవాహనంలో ప్రచార ప్రయాణం చేపట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పర్యటించేందుకు ఆదివారం ఆంధప్రదేశ్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా ప్రధాని నరేంద్రమోదీ కోయంబత్తూర్ వచ్చారు. ఆ సమయంలో కోయంబత్తూరు సిట్రా సిగ్నల్ సవిూపంలో తండ్రి ఆనంద్తో కలిసి ఆమె మోదీని విమర్శిస్తూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ భద్రతావిధుల్లో పాల్గొన్న పోలీసులు తండ్రి, కూతుళ్లను అరెస్టు చేసి రాత్రి విడుదల చేశారని తెలుస్తోంది.